- సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి
- కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేంద్రం కూడా సహకరించాలని కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీకి ముందుకొచ్చే పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహాకాలు, ఇతర అంశాలను మంత్రి శ్రీధర్ బాబు కేంద్రమంత్రికి వివరించారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాలకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న చర్యలను శ్రీధర్ బాబు కేంద్రమంత్రి అశ్విని వైష్టవ్కి వివరించారు. పలు ప్రముఖ సంస్థలు తెలంగాణలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయని, ఇలాంటి తరుణంలో డేటా భద్రత కీలకంగా మారిందన్నారు. అందుకే నేషనల్ డిజాస్టర్ రికవరీ జోన్ ఏర్పాటు చేయడం ఆవశ్యమన్నారు. ఈ అంశంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెమీ కండక్టర్ మిషన్ పురోగతిపై ఆయన అభినందనలు తెలిపారు. వచ్చే నెల 24న హైదరాబాద్ లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ని మంత్రి శ్రీధర్బాబు కోరారు.