ఈనెలాఖరిలోపు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని శాసనమండలి సభ్యుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ నూతన కార్యాలయం సందర్భంగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులుతో కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ తన నివాసంలో సమావేశం అయ్యారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి నామేనేటెడ్ పదవుల భర్తీ, మంత్రి వర్గ విస్తరణ, ఇటీవల అమలు చేస్తున్న పలు సంక్షేమ పధకాలు, ఈ నెలఖారున ఇవ్వనున్న రైతు భరోసా వంటి అనేక అంశాలపై చర్చించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని చెప్పారు. సూర్యాపేట లేదా ఖమ్మంలో ఈ సభ నిర్వహించే అవకాశం ఉందని… అందరితో చర్చించి వేదిక ఎక్కడనేది నిర్ణయిస్తామని ప్రకటించారు. నామినేటెడ్ పదవులు నెలాఖరులోపు భర్తీ చేస్తామని, మంత్రివర్గ విస్తరణ విషయం ముఖ్యమంత్రి, అధిష్టానం కలసి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కేసీవేణుగోపాల్తో జరిగిన సమావేశంలో పిసీసీ కార్యవర్గం కూర్పుపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో ఉన్నవారికే డీసీసీ అధ్యక్ష పదవులు దక్కుతాయని మహేష్గౌడ్ స్పష్టం చేశారు. వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదరరాజనర్శింహ, కొండాసురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నంప్రభాకర్, సీతక్క, పొగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల హాజరయ్యారు.