ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని, ఇక్కడ పెట్టుబుడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అలా ముందుకొచ్చే వారికి ప్రజా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. శుక్రవారం రాయదుర్గంలో ఆరిక్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ‘ పరిశ్రమలకు నైపుణ్యమున్న మానవ వనరులు అవసరం. ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో నైపుణ్యమున్న మానవ వనరులకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలవబోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని వివరించారు. ‘సుపరిపాలన అంటే మెరుగైన పౌర సేవలు ప్రజల ముంగిటకు చేర్చడం. ఈ అంశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఎప్పటికప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందిస్తున్నాం. ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలనుకునే కంపెనీలను మనస్ఫూర్తిగా మాతో కలిసి పనిచేసేందుకు ఆహ్వానిస్తున్నాం’ అని అన్నారు.
‘హైదరాబాద్ అంటే టాలెంట్ సిటీ. టెక్ సిటీ. ఇన్నోవేషన్ సిటీ. స్టార్టప్స్ కు కేరాఫ్ అడ్రస్.. ఒక్క సాఫ్ట్ వేర్ రంగంలోనే కాదు ఫార్మా, బయోటెక్ తదితర రంగాల్లోనూ అనేక పరిశ్రమలున్నాయి. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌళిక సదుపాయాలు, మానవ వనరులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అందుకే ప్రముఖ కంపెనీలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి’ అన వివరించారు. ‘రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. దానితో పాటే సవాళ్లు కూడా వస్తున్నాయి. వాటిపై కూడా ఆవిష్కర్తలు దృష్టి సారించాల్సిన అవసరముంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చి దిద్దుతున్నాం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్కిట్ సీఈవో రూపేష్ కుమార్, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి సలహాదారు సాయి కృష్ణ, తెలంగాణ ఐటీ వ్యూహకర్త శ్రీకాంత్ లంక తదితరులు పాల్గొన్నారు.