- ఎస్పీ, జెఈవో, సీఎస్ఓ, డీఎస్పీ, గోశాల డైరక్టర్లపై చర్యలు తీసుకున్న బాబు
- అసలు చర్యలు తీసుకోవాల్సింది చైర్మన్, ఈవో, జెఈవో వెంకయ్య చౌదరిల మీదన్న పవన్
వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తీవ్రంగా స్పందించారు. అధికారుల తప్పిదాలను ఎత్తి చూపారు. సీయం తన అధికారాలతో పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అంతవరకూ బానే ఉంది… కానీ డిప్యూటీ సీయం మాత్రం సీయం చర్యలు తీసుకున్న అధికారులు కాకుండా వేరే ఇద్దరు కీలక అధికారులు, టీటీడీ చైర్మన్ ఈ సంఘటనకు బాధ్యత వహించాలని ప్రకటించి సంచలనం సృష్టించారు. చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి తొక్కిసలాట జరిగిన ప్రాంతాలన్ని పర్యటించి క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులతో కలసి పోస్ట్మార్టం నిర్వహించారు. చివరికి ఐదు మంది ఉద్యోగులును ఈ దుర్ఘటనకు బాధ్యులుగా తేల్చారు. అందులో డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్రెడ్డిలను సస్పెండ్ చేశారు. టీటీడీ జేఈఓ గౌతమి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్లను బదిలీ చేశారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న డిప్యూటీ సీయం నేరుగా తొక్కిసలాట జరిగిన ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలకు వెళ్లి వారిని పరామర్శించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో తప్పు జరిగింది… క్షమించండి అని ప్రజలను బహిరంగ క్షమాపణలు కోరారు. క్షతగాత్రులు, ప్రజలు, వెంకటేశ్వరస్వామి భక్తులు అందరూ క్షమించాలని అడిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవరసం ఉందని ప్రకటించారు. బుధవారం వైకుంఠద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, జెఈవో వెంకయ్య చౌదరిలు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వీరు ముగ్గురు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. టీటీడీ అధికారులు ఎవరైనా సామన్య భక్తుల దర్శనాలపై దృష్టి పెట్టాలన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని చెప్పారు. టీటీడీ సిబ్బంది పోలీసులు ఉండి కూడా ఆరుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. బోర్డు సభ్యులందరూ మృతుల కుటుంబాల వద్దక వెళ్లి క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ సూచించారు. అయితే చంద్రబాబు పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎవరినైతే బాధ్యులుగా ప్రకటించారో వారు ముగ్గురినీ పల్లెత్తు మాట అనకపోవడం అందరికీ విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ఈవో, జెఈవో, చైర్మన్లదే అయినప్పటికీ చంద్రబాబు మాత్రం వారి ప్రస్తావన ఎక్కడా తేలేదు.