అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే తిరుమలలో ఈ దుర్ఘటన జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురువారం తిరుమలలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలతో పాటు వైకుంఠద్వార సర్వదర్శన టిక్కెట్లు విక్రయించే కేంద్రాలను సీయం పరిశీలించారు. బైరాగి పట్టెడలోని ఎంజీఎం స్కూల్ టిక్కెట్ల విక్రయ కేంద్రం వద్ద చేసిన ఏర్పాట్ల పట్ట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత మంది వస్తారని తెలిసి ఎందుకు కావల్సిన ఏర్పాట్లు చెయ్యలేదని టీటీడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రితో పాటు, టీటీడీ సిబ్బంది సంఘటన జరిగిన పరిస్ధితులను సీయంకి వివరించారు. టిక్కెట్ విక్రయ కేంద్రాల పరిసరాలన్ని తిరిగిన ముఖ్యమంత్రి కనీసం రెండు వేల మంది కూడా పట్టని ఈ ప్రదేశంలో టిక్కెట్ల విక్రయ కేంద్రాన్ని ఎందుకు పెట్టారని ఎంజీఎం స్కూల్లో టిక్కెట్ల విక్రయ కేంద్రం పెట్టడంపై టీటీడీ అధికారులను నిలదీశారు. అలాగే అక్కడ అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. క్యూలైన్లలో ఏర్పాట్లను పరిశీలించారు. చంద్రబాబుతో పాటు రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి అనిత, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, టిటిడి ఈవో శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, తదితరలు చంద్రబాబు వెంట తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.
- Advertisement with us -