మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే బుల్డోజర్తో తొక్కిస్తామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడొచ్చా? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చడానికి మాత్రం తాము వ్యతిరేకమన్నారు. పేదల ఇళ్లు కూల్చకుండానే మూసీ ప్రక్షాళన చేయవచ్ని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంది.. ప్రక్షాళనకు ఎంత ఖర్చవుతుందో రేవంత్ దగ్గర లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కోసం అవసరమైతే తామే మొదటి తట్ట ఎత్తుతాం… మొదటి పార తీస్తామన్నారు. బస్తీలో ఉంటారా ? అని రేవంత్ సవాల్ చేశారు కదా.. రేపు మూసీ పక్కన నిద్ర చేస్తామన్నారు. ప్రజలకు భరోసా ఇవ్వడానికే బీజేపీ నేతలు మూసీ పక్కన నిద్ర చేస్తున్నారని వివరణ ఇచ్చారు. రేవంత్ చెప్పినట్లు మూసీ పక్కన మూడు నెలలు ఉండటానికి నేను సిద్ధమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
బేగంపేట పర్యాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. పంటలకు ఇస్తామన్న బోనస్ కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే పోలీసులతో పాటు ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.
గతంలో ఫాం హౌస్ వీడియోలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ ఎలా రాజకీయం చేసిందో… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిన విషయం కలెక్టర్ మీద దాడి వరకు ఎందుకు వెళ్లిందో ఆలోచించాలన్నారు. అసలు తెలంగాణలో ఇలాంటి అంశాలు ఎక్కడికి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో కమిషనర్ను బదిలీ చేశారని ఆరోపించారు.