ఆధునిక సాంకేతిక పరిజ్ణానంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో ఆసక్తి కలిగించేందుకు రూపొందించిన ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ (FLOW) వాహనాన్ని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, 3 డి ప్రింటింగ్, మెషిన్ లెర్నింగ్ లతో కూడిన పరికరాలు, నిపుణులతో కూడిన ఈ ప్రత్యేక వాహనం 33 జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్ విద్యార్ధుల దగ్గరకు వెళ్తుంది. కలామ్ స్ఫూర్తి యాత్ర-33 పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. దీనికయ్యే వ్యయం లక్ష డాలర్ల సహాయాన్ని కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద ‘సేల్స్ ఫోర్స్ ఇండియా’ సంస్థ అందించింది.
ఆధునిక టెక్నాలజీపై విద్యార్థులకు ప్రేరణ కల్పించడంలో ఈ సంచార ప్రయోగశాల ఎంతో ఉపయోగపడుతుందని దానిని ప్రారంభించిన అనంతరం శ్రీధర్ బాబు కొనియాడారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, డిఇఓలు దీనిని విద్యార్థులకు చేరువయ్యేలా చూసి వారిలో టెక్నాలజీ పట్ల ఆసక్తి కలిగించేందుకు సాయపడాలని ఆయన సూచించారు. వారిలోని సృజనను, నూతన ఆలోచనలను వెలికి తీస్తాయి. కొత్త తరం విద్యార్థులకు ఈ కొత్త తరం టెక్నాలజీపై పరిజ్ణానం వారికి భవిష్యత్తులో ఎంతో సహాయ పడుతుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఈ కదిలే ప్రయోగశాల 45 రోజుల్లో 33 జిల్లాలకు చేరి విద్యార్ధులకు అవగాహన కల్పిస్తుందని శ్రీదర్ బాబు వెల్లడించారు.
రెండో దశలో వారికి ఆధునిక టెక్నాలజీని వినియోగించడంలో ప్రాక్టికల్ అనుభవం కలిగిస్తుందని తెలిపారు. తను చదువుకునే రోజుల్లో ఇటువంటి ల్యాబ్ లు అందుబాటులో ఉంటే ఇంకా ఉన్నత స్థాయికి చేరేవాడినని ఆయన అన్నారు. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ సంస్థకు వందేమాతరం ఫౌండేషన్, తెలంగాణా ఇన్నోవేషన్ సెల్ లు సహకారాన్ని అందించినట్టు సిఇఓ మధులాష్, సలహాదారు వికాస్ కాట్రగడ్డ తదితరులు పాల్గొన్నారు.