నితీష్ రెడ్డి సెంచరీ చేశాడు. చెప్పడానికి చాలా సింపుల్గా ఉంది కదా. కానీ అదంతా ఈజీ కాదన్నది క్రికెట్ తెలిసిన.. మెల్బోర్న్ టెస్ట్ చూసిన వాళ్లందరికి తెలుసు. అంతేందుకు నితీష్ రెడ్డి 99 నుంచి 100 పరుగుల మధ్య జరిగిన ఘటనలు నరాలు తెగే ఉత్కంఠను కలిగించాయి. నితీష్ సెంచరీ చేస్తాడా? చేయడా? చేయాలని కోరుకోని వారుండరు. ఎంతెంత మంది ఎన్నెన్నీ దేవుళ్లకు మొక్కారో.. మరెంత మంది మనసులో గట్టిగా కోరుకున్నారో. కానీ స్టేడియంలో ఓ వ్యక్తి మాత్రం ప్రేక్షకుల మధ్య కూర్చొని ఊపిరిని బిగబట్టి మరీ మ్యాచ్ చూశాడు. కళ్ల నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని చాలా కష్టంగా ఆపుకుంటున్నాడు. ఆయనే నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి.
నితీష్ సెంచరీ చేసే సమయంలో ఓ టెన్షన్తో కూడిన ఉద్విగ్న వాతావరణం నెలకొంది. నితీష్ 99 పరుగుల వద్ద ఉన్న సమయంలో రెండు వికెట్లను చాలా త్వరగా కోల్పోయింది టీమ్ ఇండియా. ఇంకో వికెట్ పడితే ఇండియా ఇన్నింగ్స్ ముగిసినట్టే. ఇక చివరి వికెట్గా మిగిలి ఉన్నది సిరాజ్ మాత్రమే. ఆ సమయంలో సిరాజ్కు బౌలింగ్ వేస్తున్నది కమిన్స్, బోలాండ్. ఈ ఇద్దరు కూడా తమ అనుభవాన్ని మొత్తం రంగరించి మరీ బౌలింగ్ వేస్తున్నారు. సిరాజ్ వికెట్ కూడా పడితే ఎంత మంది గుండెలు పగిలేవో. కానీ సిరాజ్ చక్కటి డిఫెన్స్ ఆడాడు.. స్ట్రైక్ రోటేట్ చేశాడు. ఇంకేముంది తెలుగు బెబ్బులీ 99 పరుగుల వద్ద కూడా ఫోర్ బాదేశాడు. తన బ్యాట్ను గర్వంగా ఆకాశానికి ఎత్తేశాడు.
ఓ వైపు గ్రౌండ్లో ఈ సీన్ జరుగుతుండగానే.. అప్పటి వరకు ఆపుకున్న కన్నీరు ఇక ఉబికి వచ్చేసింది. ఆనందంతో అతని కళ్లు తడిసిపోయాయి. తమ పక్కన ఉన్నది నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి అని తెలియగానే అతడిని ఆకాశానికి ఎత్తేశారు తోటి ప్రేక్షకులు. ఇన్నాళ్లు పడ్డ కష్టం గుర్తుకు వచ్చిందో.. కొడుకు ఈస్థాయికి చేరుకోవడానికి తాను చేసిన త్యాగాలు గుర్తొచ్చాయో.. లేక కొడుకు మరో మెట్టు ఎక్కాడన్న ఆనందం పట్టలేకపోయాడో.. కారణం ఏదైనా ముత్యాలరెడ్డి కూడా భావోద్వేగం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో మనసును హత్తుకునే సీన్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిజానికి నితీష్ రెడ్డిని బోర్డర్ గవాస్కర్ సిరీస్కు ఎంపిక చేయడంపై చాలా మంది పెదవి విరిచారు. అనుభవం లేని ప్లేయర్ ఎందుకంటూ మరికొందరి పేరు సజెస్ట్ చేశారు. కానీ వారందరి నోరు తన ఆటతోనే మూయించాడు. అంతేకాదు తగ్గేదేలే అనే జెశ్చర్తో అందరికి చెప్పకనే సమాధానం చెప్పేశాడు నితీష్ రెడ్డి.