అమెరికాలో ఇంకా జాత్యహంకార చేష్టలు తగ్గడం లేదు. ఏకంగా ట్రంప్ ప్రభుత్వంలో కీలక పదవిలో నియమితులైన వారినీ కొందరు పోకిరీగాళ్లు వదిలిపెట్టడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకో, ఏదో ఒక ఇష్యూలో పాపులర్ అయ్యేందుకో ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. తాజాగా శ్రీరామ్కృష్ణన్పై ట్విట్టర్లో ఓ ఆకతాయి చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఇప్పటికే కీలక అంశాలకు సంబంధించి పలువురిని తన ప్రభుత్వంలో నియమించారు. వారిలో ఆర్టిఫిషియిల్ ఇంటటలిజెన్స్ సీనియర్ పాలసీ సలహాదారుగా భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ కూడా ఉన్నారు. అప్పటినుంచి ఇమ్మిగ్రేషన్, గ్రీన్ కార్డ్ క్యాప్లపై వివాదాస్పద వాదనల గురించి చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్నెట్ యూజర్ తన ఎక్స్ ఖాతాలో శ్రీరామ్కృష్ణన్కు సంబంధించి అభ్యంతరకరమైన ఫోటోను షేర్ చేశాడు. అంతేకాదు.. జాత్యహంకారంతో కూడిన కామెంట్ చేశాడు. శ్రీరామ్కృష్ణన్ ముఖానికి బటర్ చికెన్ పూసినట్లు ఏఐలో ఇమేజ్ క్రియేట్ చేసి ఓపక్కన శ్రీరామ్కృష్ణన్, మరోపక్కన ఆయన ముఖంపై బటర్ చికెన్ చిమ్మినట్లు రూపొందించిన ఇమేజ్ పోస్ట్ చేశాడు. ‘శ్రీరామ్ కృష్ణన్ బటర్ చికెన్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు” అని ఆ ట్వీట్కు కామెంట్ చేశాడు. అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వంటకం బటర్ చికెన్. దీనిని బట్టి అటు శ్రీరామ్కృష్ణన్తో పాటు.. భారతీయుల పట్ల కూడా వెకిలి చేష్టలు ప్రదర్శించినట్లు అర్థమవుతోంది.
ఎక్స్లో బోన్జీపీటీ అనే యూజర్ ఈ వివాదాస్పద పోస్టు చేశాడు. అయితే, దీనిపై జాసన్ అనే వ్యాపారవేత్త రియాక్ట్ అయ్యారు. బోన్ జీపీటీ పోస్టును ప్రస్తావిస్తూ.. ”ఈ జాత్యహంకార దాడులు అసహ్యంగా ఉన్నాయి” అని అభిప్రాయపడ్డారు. ‘రికార్డు కోసం అద్భుతంగా ఉంది’ అని కూడా అదే పోస్టులో ఒపీనియన్ షేర్ చేశాడు. దీనిపై ఎలాన్ మస్క్ రెస్పాండ్ అయ్యారు. జాసన్ కామెంట్కు రిప్లై ఇస్తూ.. ‘హండ్రెడ్ పాయింట్స్’ ఎమోజీతో రియాక్ట్ అయ్యారు. ఇది వందశాతం మద్దతు తెలుపుతున్నట్లు, నూటికి నూరుశాతం ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు సోషల్ మీడియాలో వ్యక్తీకరించడానికి ఈ ఎమోజీని వాడతారు. ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ ప్రభుత్వంలో కీలక పదవిలో నియమితులయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి అధిపతిగా నియమితులయ్యారు.
ఇప్పుడు ఎక్స్లో శ్రీరామ్కృష్ణన్పై చేసిన అభ్యంతరకర కామెంట్, ఎలాన్మస్క్ రెస్పాన్స్ వైరల్గా మారాయి. ప్రవాస భారతీయుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.