రాష్ట్రంలో అన్నిచోట్లా ఇవ్వాలనే డిమాండ్లు
కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన ఏర్పాట్లు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 10 నుంచి 19 వరకూ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. కొత్తగా కూటమి ప్రభుత్వం రావడం, టీటీడీ బోర్డు కొత్తది రావడం, అలాగే కొత్త ఈవో శ్యామలరావు రావడంతో వీరందరూ ప్రతిష్టాత్మకంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించాలని కృతనిశ్చయంతో ఉన్నారు.
ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భక్తులకు ఆన్ లైన్ లో టిక్కెట్లను ఇచ్చేశారు. పక్కా ప్రణాళికతో ఒకొక్కటి అమలు చేస్తున్నారు. ఇప్పుడు సర్వదర్శనం టోకెన్లు కూడా ఒకరోజు ముందు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ టోకెన్ లేని భక్తులను తిరుమలలో దర్శనాలకు అనుమతించరు. డోనర్స్, వీఐపీలు, ఆన్ లైన్ లో టోకెన్ తీసుకున్నవాళ్లు, కొండ దిగువన తిరుమలలో సర్వదర్శనం టోకెన్ తీసుకున్నవాళ్లకే ప్రవేశం ఉంటుంది.
జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను జనవరి 9 ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లు ఇస్తామని అన్నారు. తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో ఏ రోజుకారోజు.. ఆ ముందు రోజు టోకెన్లు జారీ ఇస్తామని వివరించారు.
వైకుంఠ ఏకాదశికి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే ప్రాంతాలు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, మున్సిపల్ గ్రౌండ్, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన హైస్కూల్, శ్రీనివాసం, విష్ణునివాసం, ఎం.ఆర్. పల్లి స్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక కొండపైన తిరుమలలో నివాసం ఉండే స్థానికుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటిలో ఏరోజుకా రోజు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జారీ చేస్తామని ఈవో తెలిపారు.
ఇకపోతే తిరుపతిలోని మొత్తం 8 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. అందులో 87 కౌంటర్లు ఉంటాయని అన్నారు. ఇక తిరుమలలో 4 కౌంటర్లు మాత్రమే ఉంటాయి. అయితే పైన కొండమీద నివాసం ఉండేవారు ఆధార్ కార్డుల్లో తిరుమల అడ్రస్ ఉండాలని అన్నారు. అలాగే సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకు ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ అందిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో అన్నిచోట్లా సర్వదర్శనం టిక్కెట్లు ఇవ్వాలి
వీళ్లు విధిగా ఆధార్ కార్డు చూపించి టోకెన్ పొందాల్సి ఉంటుందని అన్నారు. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఇస్తే టిక్కెట్లు తీసుకుని రావడానికి వీలుగా ఉంటుందని భక్తులు కోరుతున్నారు. తీరా అక్కడకు వచ్చాక టోకెన్ దొరక్కపోతే అదొక బాధని అంటున్నారు. తిరుపతిలోనే ఇవ్వడం వల్ల దగ్గరవారికి, స్థానికులకే లాభం తప్ప దూరాభారంగా ఉన్నవారికి కాదని ఆరోపిస్తున్నారు. స్వామివారికి ప్రపంచం మొత్తమ్మీద భక్తులున్నారని చెబుతున్నారు.
మహా కుంభమేళాకు టీటీడీ నమూనా దేవాలయం
ఉత్తర ప్రదేశ్ అలహాబాద్ లోని ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహాకుంభమేళకు టీటీడీ తరపున నమూనా ఆలయ నిర్మాణం చేస్తున్నారు. జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. ఈ నేపథ్యంలో స్వామివారు కొలువుదీరిని తిరుమల నమూన ఆలయాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ తిరుపతి జేఈవో గౌతమి అధికారులను కోరారు.