- దర్శనానికి 24 గంటలు
- తిరుమలలో మైక్ లో ప్రకటిస్తున్న టీటీడీ
- టోకెన్ తీసుకోడానికే 10 గంటలు
- దర్శనానికి మరో 14 గంటలు
- ఒక్కరోజు 72 వేల మంది దర్శనం
వరుసగా సెలవులు రావడంతో తిరుమల భక్తజనంతో నిండిపోయింది. డిసెంబర్ 27న ఒక్కరోజు 72 వేలమంది దర్శనం చేసుకున్నారు. ఇకపోతే ఆన్ లైన్ లో టికెట్లు పొందిన భక్తులు సులువుగా దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు. కానీ సర్వదర్శనం కోసం వెళ్లిన భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. అయితే కొంతలో కొంతమేలు ఏమిటంటే, సర్వదర్శనం కోసం కూడా టోకెన్లు జారీ చేయడంతో రద్దీని కంట్రోలు చేయగలుగుతున్నారు. ఇది కొత్త ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే సర్వదర్శనం టోకెన్ తీసుకోవడానికే దాదాపు 10 గంటల సమయం పడుతోంది. అక్కడ టైమ్ స్లాట్ తీసుకొని చాలామంది బయటకు వచ్చేస్తున్నారు. ఉదాహరణకి సోమవారం ఉదయం 6 గంటలకి సర్వదర్శనంలోకి వెళ్లిన భక్తులకు టోకెన్ 10 గంటల తర్వాత అంటే సాయంత్రం 4 గంటలకు దొరికిందని అనుకుందాం. అందులో దర్శన సమయం మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయం 6 గంటలకి అని ఇస్తున్నారు.
అయితే ఆ టోకెన్ పట్టుకుని ఉదయం 6 గంటలకి వెళితే, లోపలకి అనుమతించడ లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ రద్దీ క్లియర్ కాకపోవడంతో వీరిని వదలడం లేదు. దీంతో అదేరోజు అంటే మంగళవారం సాయంత్రం 6 గంటలకు వెళితే అనుమతిస్తున్నారు. అలా 4 లేదా 5 గంటల్లో దర్శనం చేసుకుని వస్తున్నారు. అంటే సోమవారం ఉదయం 6 గంటల నుంచి లెక్క వేస్తే, మంగళవారం రాత్రి 10 గంటలు అంటే దాదాపు 40 గంటలు పడుతోంది.
కాకపోతే, టోకెన్ తీసుకుని బయటకు వచ్చినవాళ్లు పర్వాలేదు. హ్యాపీగానే దర్శనం చేసుకువెళ్లిపోతున్నారు. ఏదో టోకెన్ తీసుకున్న దగ్గర ఇబ్బంది తప్ప, అంతా బాగానే ఉంది. ఎటొచ్చి టోకెన్ తీసుకుని బయటకు రాకుండా దర్శనం గదుల్లోకి వెళ్లిపోయిన వాళ్లే ఎన్నో అవస్థలు పడుతున్నారు.
అందుకే ఈసారి తిరుమల దేవస్థానానికి వెళ్లేవాళ్లు రిజర్వేషను టిక్కెట్లు ఇలా ప్లాన్ చేసుకుని తీసుకుంటే, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య నడిచే రైళ్లను పలువురు మిస్ అవుతున్నారు. అవి ఖాళీగా వెళ్లడమే అందుకు నిదర్శనం.
స్వామివారి దర్శనం టిక్కెట్లు లేనివాళ్లు మాత్రం ఒక రోజు ముందు తిరుపతి చేరుకోవాలి. సాయంత్రం 6 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణువాసం, ఇంక అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులకు వెళితే, అర్థరాత్రి 12 గంటలకు ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. 20 వేల టిక్కెట్లు రెండు గంటల్లో అయిపోతున్నాయి.
ఇక నడకదారిలో అటు అలిపిరి, ఇటు శ్రీవారి మెట్లు వద్ద టోకెన్లు ఇస్తున్నారు. పైన రద్దీని బట్టి ఇక్కడ టోకెన్లు నామమాత్రంగా ఇస్తున్నారు. అంటే ఒకసారి ఒకొక్కదగ్గర 5వేల చొప్పున ఇస్తే, రద్దీ సమయంలో అందులో సగమే ఇస్తున్నారు. అలాగే గురువారం రోజున స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. అభిషేకాలు ఉంటాయి. అందువల్ల టోకెన్లు తగ్గించేస్తున్నారని అంటున్నారు. వారం మధ్యలో మంగళవారం, బుధవారం నాడు కొంత రద్దీ తక్కువగా ఉంటుందని అంటున్నారు. డిసెంబరు 26నాడు మొత్తం 24,905 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.4.18 కోట్లు ఆదాయం వచ్చింది.