ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతీ యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా పులివెందులలో క్రిస్మస్ పర్వదిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. జగన్ సహా కుటుంబసభ్యులందరూ ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు. కొద్దిరోజులుగా నెలకొన్న ఫ్యామిలీ వివాదాల చర్చ నడుస్తున్న సమయంలో కుటుంబసభ్యులందరూ ఒకే వేదిక మీదకు వచ్చి పండుగ జరుపుకున్నారు.
ముందుగా పులివెందులకు చేరుకున్న జగన్.. ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖర్రడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రేయర్ హాల్లో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇద్దరు కూతుళ్లతో పాటు కుటుంబసభ్యులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్ధనలకు హాజరయ్యారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గం లో నడిపిస్తాయని జగన్ పేర్కొన్నారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని జగన్ తన సందేశంలో వివరించారు.