పుష్ప రాజ్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ప్రభుత్వం, అల్లు అర్జున్ ఇరు వర్గాలు తగ్గేదేలే డైలాగ్ స్పూర్తితో వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరికి వారే తమ చర్యలను సమర్థించుకుంటున్నారు.
అల్లు అర్జున్కు పోలీసులు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని చిక్కడపల్లి పోలీసులు ఈ రోజు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందటంతో అల్లు అర్జున్పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
పోలీసు తాజా నోటీసుల నేపథ్యంలో అప్రమత్తమైన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు..లీగల్ టీమ్ తో భేటీ అయ్యారు. రేపు విచారణ ఉన్నందున పోలీసులు అడగబోయే అవకాశమున్న ప్రశ్నలు.. సమాధానం ఇవ్వాల్సిన విషయాలపై చర్చలు జరుపుతున్నారు.