బాక్సింగ్ డే…టెస్ట్ పై ఉత్కంఠ
టీమ్ ఇండియా ఈసారైనా గెలుస్తుందా? లేదా? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈనెల 26 నుంచి 31 వరకు మెల్ బోర్న్ లో బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు టెస్టులు జరిగాయి. ఇక రెండే మిగిలాయి. ఇవి గెలిస్తేనే వరల్డ్ ఛాంపియన్ రేస్ లో నిలిచేందుకు అవకాశాలున్నాయి. లేదంటే పెట్టేబేడా సర్దుకుని బయలుదేరాల్సిందేనని అంటున్నారు. అందుకనే ఈ టెస్టుపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.
ఈ సిరీస్ ప్రభావం కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా పడేలా కనిపిస్తోంది. కెప్టెన్ పదవికే ఎసలు వచ్చేలా ఉంది. ఎందుకంటే అటు కెప్టెన్ గా, ఇటు ఆటగాడిగా కూడా వరుసగా విఫలమవుతున్నాడు. టీమ్ ఇండియా ఆటగాళ్ల పేర్లు పేపరు మీద చూస్తే పులుల్లా కనిపిస్తున్నారు. ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, నితీష్ కుమార్, రవీంద్ర జడేజా ఇలా చూస్తే వరుసగా ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. శత్రుదుర్భేధ్యంలా ఉంది. అయినా సరే, పేకమేడలా పడిపోతున్నారు.
ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. నువ్వు ఒకటి కొడితే, నేను సున్నా అంటున్నారు. పోటీ పడి పరీ అవుట్ అవుతున్నారు. మొత్తమ్మీద టీమ్ ఇండియా ఆటతీరు నిరాశజనకంగా మారింది. ఇది కూడా కొత్త కోచ్ గౌతం గంభీర్ వచ్చిన దగ్గర నుంచి టీమ్ సెటప్ మారిపోయింది. ఆయన మూడు ఫార్మాట్లకు మూడు జట్లను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. అలా వారిని అక్కడే పాడేశాడని అంటున్నారు.
అదే రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పుడు తను కూడా ఇలాగే చేశాడు కానీ, పూర్తిగా పక్కన పెట్టలేదు. అవసరమైతే అందులోంచి ఒకడిని తీసుకొచ్చేవాడు. ఇక్కడ బ్యాలెన్స్ సరిచేసే వాడు. గంభీర్ వచ్చాక ఆ విధానం కంప్లీట్ మారిపోయింది. ఆడేతే వీళ్లే ఆడాలి. లేదంటే లేదన్నట్టు మారింది. అదీకాక ద్రావిడ్ అయితే ఆటగాళ్ల లోపాలపై ప్రాక్టీసు చేయించేవాడని అంటున్నారు.
ఆటగాడు ఎక్కడ అవుట్ అవుతున్నాడో, నెట్ లో అదే తరహా బాల్స్ వేయించి, పదేపదే ప్రాక్టీసు చేయించేవాడు. తన టెక్నిక్ ఎక్కడ మిస్ అవుతున్నాడో…టీవీ రీప్లేలు దగ్గరపెట్టి మరీ స్పష్టంగా తెలియచేసేవాడు. ఇక్కడా పని జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నింటికన్నా మించి గౌతంగంభీర్ సిన్సియర్ గా చెబుతున్నా, సీనియర్లు సీరియస్ గా తీసుకోవడం లేదని అంటున్నారు.
తను కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాక శ్రీలంక పర్యటనకు వెళ్లి వన్డే సిరీస్ కోల్పోయింది. తర్వాత న్యూజిలాండ్ తో స్వదేశంలో 3-0తో టెస్టు సిరీస్ ఓటమిపాలైంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరిస్థితి 1-1తో ఉంది. అదే టీ 20 సిరీస్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. అదే సీనియర్లతో విఫలమవుతోంది. మరిప్పుడు నాలుగో టెస్టులో విజయం సాధిస్తుందా? లేదా? అనే అంశంపై నెట్టింట బాగా చర్చ జరుగుతోంది.