భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పివి ఘాట్ జ్ఞానభూమి వద్ద జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టితో పాటు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన పీవీ.. పండితుడిగా, రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా దేశానికి విశేష సేవలు అందించారని ఉపముఖ్యమంత్రి కొనియాడారు. 1972లో పార్లమెంటుకు ఎన్నికై.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల మంత్రివర్గంలో 1980 నుండి 1984 వరకు విదేశాంగ మంత్రిత్వ శాఖతోపాటు అనేక క్యాబినెట్ పదవులను నిర్వహించారన్నారు. రాజకీయాల్లో చాణక్యునిగా పేరు తెచ్చుకున్న పివి ప్రధానిగా దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కెించారని, ఆయన సేవలు చిరస్మరణీమని భట్టి విక్రమార్క వివరించారు. పివీ నరసింహారావు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమని డిప్యూటీ సీయం అన్నారు.