భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద వైఖరిని ఎండగడుతు ఆయన రాహుల్ గాంధీకి లేఖ రాశారు. జాతీయ స్థాయిలో అదానీ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు.
కేటీఆర్ తన లేఖలో, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో గౌతం అదానీపై నిరసనలు వ్యక్తం చేస్తూ, మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే, తెలంగాణలో రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్కు ఎర్ర తీవాచీ పరచడం విడ్డూరంగా ఉందని అన్నారు. “మీ పార్టీ ఒకవైపు అదానీ గ్రూప్ క్రోనీ క్యాపిటలిజంపై పోరాటం చేస్తోందని చెప్పుకుంటుంది, మరొకవైపు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్ కోసం సూమారు 12 వేల కోట్ల రూపాయాల భారీ డీల్స్ కుదుర్చుకుంటున్నాడు” అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
డిసెంబర్ 18న టీపీసీసీ ‘చలో రాజ్భవన్’ కార్యక్రమంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అదానీ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టిన ఉద్యమంలో ఈ కార్యక్రమం చేపట్టి, తెలంగాణలో మాత్రం అదానీతో అంటకాగుతున్న రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గోనడం కాంగ్రెస్ ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అదానీ గ్రూప్కు పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. దీంతోపాటు గౌతం అదానీ రేవంత్ రెడ్డికి ఇచ్చిన రూ. 100 కోట్ల విరాళం, బీఆర్ఎస్ ఈ విషయాన్ని బయటపెట్టిన తర్వాతే తిరిగి ఇచ్చివేసిందని కేటీఆర్ ఆరోపించారు. “అది ‘క్విడ్ ప్రో కో’ కు క్లాసిక్ ఉదాహరణ” అంటూ, “అవినీతి వ్యతిరేక పోరాటమంటే ఇదేనా? దానం తీసుకుని దొంగలాగా దొరికిన తర్వాత తిరిగి ఇవ్వడమా?” అని ప్రశ్నించారు.హైదరాబాద్ హోటళ్లలో అదానీ ప్రతినిధులతో కాంగ్రెస్ నాయకులు భూ దందా చేస్తున్నారని, అందులో కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు కూడా భాగస్వామ్యులుగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాహుల్ గాంధీకి సూటిగా సవాలు విసిరారు. “మీ సీఎం రేవంత్ రెడ్డితో అదాని అనుబంధం గురించి మీరు ప్రశ్నిస్తారా? లేక ఆయన వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడటానికి మౌనంగా ఉంటారా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అదానీ వ్యతిరేక నిరసనలు ఒక “రాజకీయ డ్రామా”గా అభివర్ణించారు.
తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని క్షమించరని, వారిని సరైన సమయంలో ప్రజా క్షేత్రంలో శిక్షిస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయంలో తన నిబద్దతను నిరూపించుకుంటూ అదానీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం విషయంలో తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక జాతీయ పార్టీగా పార్టీకి తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలలో ఒకే వైఖరి ఉండాలని, కానీ తెలంగాణలో దోచుకుంటాం, కానీ డీల్లీలో నిరసనలు తెలుపుతామన్న వైఖరి పక్కా అవకాశవాదం అవుదన్న విషయం రాహుల్ గాంధీ తెలుసుకోవలన్నారు. ఈ వ్యవహారంలో రాహుల్ గాందీ వైఖరి దేశ ప్రజలముందు నవ్వులపాలువుతుందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి అదానీ విషయంలో పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించేలా అదేశాలివ్వాలని లేకుంటే కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రజలు గుర్తిస్తారని తెలుసుకోవాలన్నారు.