ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో రాటుదేలి పోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన నోటివెంట ఎప్పుడూ అబద్ధాలే వస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం కొలువుదీని ఏడాది పూర్తయినా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
అబద్ధాలతో సీఎం తన మంత్రివర్గ సహచరులను, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అప్పులకు తన ప్రభుత్వం ప్రతి నెల రూ.6500 కోట్ల వడ్డీ చెల్లిస్తోందని సీఎం చెబుతున్నారని, అది కూడా పచ్చి అబద్ధమని అన్నారు. తెలంగాణ అప్పులకు ప్రభుత్వం చెల్లిస్తోన్న వడ్డీ రూ.2900 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు ప్రభుత్వం వడ్డీల రూపంలో కేవలం రూ.2164 కోట్లు మాత్రమే చెల్లించినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని కేటీఆర్ అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ముందుగా తన ప్రవర్తనను మార్చుకుని, తెలంగాణ ప్రజలను అయోమయానికి గురచేయడం మానెయ్యాలని సూచించారు. హరీష్రావుపై తప్పుడు కేసు పెట్టారని, అలాంటి కేసులకు తాము భయపడబోమని అన్నారు.
తెలంగాణలో ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పులు కొత్తగా చేశారు. రాష్ట్రం అధోగతి పాలైంది.. ప్రజలు తిప్పలపాలయ్యారు. రేవంత్ బ్రదర్సేమో కోట్లకు పడగలెత్తారు. రేవంత్ పాలన అంటే గుర్తుకొచ్చేది లక్ష కోట్ల అప్పులు, దారుణ ఘాతుకాలు, తప్పులు. ఈ ఏడాదిలో ఏం సాధించావు అంటే సమాధానం లేదు. ఆర్భాటం ,హడావుడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్నాడు. అప్పుల మీద కాదు.. నీ తప్పుల మీద చర్చ జరగాలి. ఇవాళ సూటిగా అడుగుతున్నాం దమ్ముంటే సమాధానం చెప్పు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి స్థాయి దిగజార్చావు. నీ ప్రభుత్వంలో మీ బ్రదర్స్ బాగుపడ్డారు. వారికి లాభం జరిగింది. రాష్ట్రానికి వెయ్యి కోట్ల పెట్టుబడులు ఇచ్చే స్థాయికి అనుముల బ్రదర్స్ ఎదిగారని ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరంటే అనుముల బ్రదర్స్ అని వస్తదమో.. అదానీని కూడా దాటేస్తారేమో అని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
నీ ఏలుబడిలో రాష్ట్రానికి రాబడి తెచ్చే తెలివి లేదు. సంపద పెంచే సోయి లేదు. పాజిటివ్ పని చేసిన ముఖం లేదు. తెల్లారి లేస్తే కాకి కూతలు.. కేసీఆర్ మీద తిట్టు.. దేవుళ్ల మీద ఒట్లు.. ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచావు. రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సింది పోయి.. దివ్యంగా ఉన్న రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపణలు చేసిన దివాళాకోరు సీఎంవి నీవు. కొత్త పరిశ్రమలు కాదు.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టుకున్నాడు.. తెలంగాణ రైజింగ్ అని అంటున్నడు. అనుముల బ్రదర్స్ రైజింగ్ అని పెట్టుకోవాలి. తెలంగాణ మాత్రం ఫాలింగ్ అని చెప్పాలి. పన్నెండు పాలన మొత్తం అసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీంలు తప్ప ఏం పీకారు. అబద్దాల కోరుగా తయారై మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నావ్. ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగొద్దని.. అప్పులు అంటూ కారుకూతలు కూస్తున్నావంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కొన్ని అబద్దాలు పదేపదే వల్లె వేస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక అబద్దాన్ని వందసార్లు చెప్తే నిజమైపోతదనే నానుడి ఏదైతో ఉందో దాన్ని అనుసరించుకుని ఇవాళ జోసెఫ్ గోబెల్స్ను ఆదర్శంగా తీసుకుని ఈ సీఎం, మంత్రివర్గం ప్రయత్నం చేస్తోంది. ప్రజలు, మీడియా దృష్టికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల గురించి తెలియజేయాలని ఈ సమావేశం నిర్వహించాం అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి సంవత్సరం అయింది. బాక్సింగ్ క్రీడలో ఒక సామెత ఉంటది.. ఎంత గట్టిగా పంచ్ విసరగలిగామన్నది కాదు.. ఎంత గట్టిగా పంచ్ను విసిరినా తట్టుకుని తిరిగి నిలబడాలన్నది ముఖ్యం. ఇది క్రీడాకారుడికి పరీక్ష. ఆ విధంగా ఈ ఏడాది కాలంలో బీఆర్ఎస్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన, కేసీఆర్కు గాయమైనా.. కవితను అరెస్టు చేసి ఐదున్నర నెలలు జైల్లో పెట్టినా, పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని ఓటమి పాలైనా.. మా పార్టీ జెండా మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా.. కేసులు పెట్టినా, అవమానాలకు గురి చేసినా తట్టుకుని నిలబడ్డాం. లగచర్లలో గిరిజన రైతుల పక్షానా నిలబడ్డాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోరుబాట పట్టామని కేటీఆర్ గుర్తు చేశారు.
ఈ రోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. హైడ్రా, మూసీ బాధితులతో పాటు పలువురు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులు తమ వేదనను చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలి.. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని వాలంటీర్లుగా పని చేస్తున్న వారికి, సోషల్ మీడియా సైనికులకు, ప్రతి రోజు కాంగ్రెస్తో తలపడుతున్న కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా సింహాల్లా పోరాడుతున్న నాయకులకు ధన్యవాదాలు అని కేటీఆర్ తెలిపారు.