సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన భద్రత, అత్యవసర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాలలో రద్దీ ఎక్కువగా ఉండే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, జాతీయ విపత్తుల స్పందనా దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తుల స్పందనా దళం (ఎస్డీఆర్ఎఫ్) బలగాలను కాళేశ్వరం ప్రాంతంలో మోహరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఎన్డీఆర్ఎఫ్ నుండి 34 మంది సిబ్బందితో కూడిన ఒక బృందం, ఎస్డీఆర్ఎఫ్ నుండి 66 మంది సభ్యులతో కూడిన రెండు బృందాలు మూడు షిప్టుల్లో 24 గంటల పాటు సేవలందించనున్నాయి.
వీఐపీ ఘాట్, సరస్వతి మాత విగ్రహం, త్రివేణి సంగమం, గోదావరి ఘాట్, దేవాలయం ప్రాంతాల్లో భద్రతా చర్యలను ఈ బృందాలు పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడిన వేళ వెంటనే స్పందించేలా ఈ బృందాలు ఘాట్ల వద్ద సిద్ధంగా ఉంటాయి. రెండు బృందాలు ఘాట్ల వద్ద, మరో బృందం దేవాలయం వద్ద మోహరించనున్నారు. రద్దీ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
భక్తులు అధికారుల సూచనల ప్రకారం నిబంధనలు పాటిస్తూ పుష్కర స్నానాలు చేయాలని, ప్రమాద హెచ్చరికల సూచికలను దాటి నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వ్యర్థాల తొలగింపు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నారు. నదీ తీరాలు, దేవాలయ పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక సంస్థలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేలా అదనపు కలెక్టర్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.
ఈ భద్రతా మరియు పరిశుభ్రత ఏర్పాట్లను రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద కుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి కెవి సతీష్ కుమార్, ఎన్డీఆర్ఎఫ్–ఎస్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్ సింగ్, కాటారం డీఎస్పీ రామిరెడ్డి, దేవస్థానం ఈఓ మహేష్ తదితరులు పరిశీలించారు.