సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. పాకిస్తాన్ కుటిల చర్యలకు పాల్పడుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం, భారత రక్షణ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నిరంతరాయంగా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు, సలహాలు, సూచనలు జారీచేస్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి పరిణామాలు ఎదురైనా అప్రమత్తంగా ఉండేందుకు అత్యవసర సర్వీసులైన వైద్య సేవల గురించి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో అందరికీ సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎయిమ్స్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, అన్ని విభాగాల ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వాళ్ల సెలవులు కూడా రద్దు చేసింది. సెలవుల్లో ఉన్నవాల్లందరూ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెలువడే దాకా సెలవుల రద్దు నిర్ణయం అమలులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది.