ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారానే ప్రజలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనానికి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వైద్య రంగానికి రూ 5950 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలో రూ11,482 కోట్లు ఖర్చు చేసిందని భట్టి వివరించారు. ఉద్యోగుల అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని ముఖ్యమంత్రి చెపితే దానిని చిలవలు పలవలు చేసి బీఆర్ఎస్ మాట్లాడుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన వైద్య రంగాన్ని మేము వచ్చాక గాడిన పెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందజేసినట్టే ఉద్యోగుల ను కాపాడుకుంటామని భట్టి అన్నారు.