బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా బీసీ కమిషన్ రాష్ట్రం లో రెండు విడతలుగా పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి బహిరంగ విచారణలు చేపట్టింది. దీనికి కొనసాగింపుగా రాష్ట్ర స్థాయిలో రెండు రోజులపాటు కమిషన్ కార్యాలయంలో బహిరంగ విచారణలు జరిపింది. బహిరంగ విచారణలో వివిద కుల సంఘాల నుండి వారి వారి వినతులను అఫిడవిట్ రూపంలో స్వీకరించింది. కుల సంఘాలు, స్వచ్చంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున బహిరంగ విచారణకు హాజరై తమ తమ విజ్ఞప్తులను కమిషన్ కు సమర్పించడం జరిగింది.
ఈ వినతులలో భాగంగా మొత్తంగా బీసీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించడం జరిగింది. వివిధ కుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను, వెనుకబాటుతనాన్ని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులను దేవాలయ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గంగపుత్రులకు చేపల చెరువులలో 50% రిజర్వ్ చేయాలని, ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని కోరారు. బీసీలలో గ్రూపుల మార్పు, వివిధ కులాల ఫెడరేషన్ల ఏర్పాటు మరియు బలోపేతం వంటి పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్ , బాలలక్ష్మీ రంగు, డిప్యూటీ డైరెక్టర్ యు. శ్రీనివాస రావు, స్పెషల్ ఆఫీసర్ జి సతీష్ కుమార్ పాల్గొనడం జరిగింది. బహిరంగ విచారణ అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ జి నిరంజన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పది ఉమ్మడి జిల్లా కేంద్రాలు మరియు రాష్ట్ర స్థాయిలో జరిగిన పబ్లిక్ హియరింగ్ లో మొత్తంగా 1336 వినతులు వచ్చాయని, వీటిపై కమిషన్ త్వరలో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుందని తెలపడం జరిగింది.