మధ్యప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో కొలువై ఉన్న మహా కాళేశ్వర ఆలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు వెదజల్లడం, దాదాపు కిలోమీటరు దాకా ఆ పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు, స్వామి వారి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఆలయ శంఖ ద్వారం, సిసీటీవీ కంట్రోల్ రూమ్కు పైన ఉన్న రూఫ్ వద్ద మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. హుటాహుటిన నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కు చెందిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్కు సంబంధించిన బ్యాటరీ నుంచి తొలుత మంటలు వచ్చాయని, బ్యాటరీ తీవ్రంగా వేడెక్కడంతో మంటలు తలెత్తినట్లు గుర్తించారు.
అగ్నిప్రమాదం జరగడంతో ఆలయంలో స్వామివారి దర్శనాన్ని కొద్ది సేపు నిలిపివేసారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. కలెక్టర్ రోషన్ కుమార్, ఎస్పీ ప్రదీప్ శర్మ, మహకాళేశ్వర్ ఆలయ నిర్వాహకులు ప్రథమ్ కౌసిక్, మున్సిపల్ కమిషనర్ ఆశిష్ పాథక్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ రోషన్ కుమార్ చెప్పారు.