సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. వరుసగా ఎనిమిది రోజుల నుంచి రాత్రి సమయంలో భారత ఆర్మీ పోస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరుపుతూనే ఉంది. మొదట ఒక ఆర్మీ పోస్ట్ను టార్గెట్ చేస్తూ మొదలైన కాల్పులు.. ఇప్పుడు అనేక సెక్టార్లకు విస్తరించాయి. పాక్ తీరును చూస్తుంటే కావాలనే భారత ఆర్మీని రెచ్చగొట్టే చర్యలు చేపడుతుందని అర్థమవుతోంది. భారత్ గట్టిగా సమాధానమిస్తే.. దానిని అంతర్జాతీయ సమాజం దృష్టిలో పెట్టాలని ఊవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తోంది.
పాక్ కవ్వింపు చర్యలపై ఇండియన్ ఆర్మీ తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే ఈ విషయంపై ఇరు దేశాల మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ హాట్ లైన్లో చర్చించారు. అయినా కానీ ఎలాంటి మార్పు లేదు. పహెల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సింధూ నది జలాల పంపకానికి సంబంధించిన ఒప్పందం నిలిపివేత ప్రధానమైంది. ఈ నిర్ణయంతో పాక్కు దిమ్మతిరిగింది. ఈ నిర్ణయం వెలువడిన మరుసటి రోజు నుంచి పాక్ కవ్వింపు చర్యలు మొదలయ్యాయి.
మొదట LOC వెంట మొదలైన ఈ కాల్పులు.. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల్లో కూడా మొదలయ్యాయి. కుప్వారా, బారాముల్లా సెక్టార్లో తొలిసారి కాల్పులు జరగగా.. ఆ తర్వాత పూంచ్, సుందేర్బాని, నౌషేర్, రాజౌరి, పర్గ్వాల్ సెక్టార్లకు విస్తరించాయి. ఈ కాల్పులతో పాక్ సాధించేది ఏం లేదని ఆ దేశానికి కూడా తెలుసు. కానీ భారత్ ఓపిక నశించి.. ఏదైనా చర్య తీసుకుంటే దానిని సాకుగా చూపి సానుభూతి పొందాలన్నది పాక్ ప్లాన్గా కనిపిస్తోంది.
పాకిస్థాన్తో 3 వేల 323 కిలోమీటర్ల సరిహద్దును షేర్ చేసుకుంటున్న భారత్. ఇది మొత్తం మూడు భాగాలుగా విభజించారు. ఒకటి అంతర్జాతీయ సరిహద్దు. ఇది గుజరాత్ నుంచి కశ్మీర్లోని చీనాబ్ నది తీరంలో ఉన్న అక్నూర్ వరకు దాదాపుగా 2 వేల 400 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక జమ్ము నుంచి లేహ్ వరకు ఉన్న ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్.. ఇది 740 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక సియాచిన్ రీజియన్లో ఉన్న యాక్చువల్ గ్రౌండ్ పోజిషన్ లైన్. ఇది 110 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.