- టాలీవుడ్ లో సరికొత్త వివాదం
- సంభాషణలను తొలగిస్తున్నట్లు హీరో ప్రకటన
టాలీవుడ్లో ఇప్పుడు సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. సింగిల్ మూవీ ట్రైలర్ ఇప్పుడీ వివాదానికి కేరాఫ్గా మారింది. ట్రైలర్లో వాడిన కొన్ని పదాలు ఇప్పుడు మరో అప్కమింగ్ మూవీని.. ఓ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు అనిపించడం కొందరి మనోభావాలను దెబ్బతీసింది. సింగిల్ మూవీ ట్రైలర్లో శివయ్యా.. మంచు కురిసిపోయింది అనే పదాలు ఇప్పుడు మంచు ఫ్యామిలీని.. కన్నప్ప మూవీని టార్గెట్ చేసినట్టు కనిపించాయి. దీంతో ఈ వివాదానికి బీజం పడింది.
మోహన్ బాబు ఇంటి పేరు మంచు కావడంతో ఈ వివాదం తెరపైకి వచ్చిందనే చెప్పాలి. మోహన్బాబు కుటుంబాన్ని, కన్నప్ప సినిమాపై సెటైర్లు వేసినట్టు ట్రైలర్ ఉందంటూ మోహన్బాబు అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ హైలేట్ ఏంటంటే.. సింగిల్ సినిమాను నిర్మించింది అల్లు అరవింద్కు చెందిన గీతా ఆర్ట్స్. ఇది ఈ వివాదాన్ని మరింత పెంచింది.
మంచు ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారంటూ విమర్శలు చేస్తున్నారు మంచు ఫ్యామిలీ అనుచరులు. సోషల్ మీడియాలో ఈ వివాదం పీక్స్కు చేరడంతో సింగిల్ టీమ్ మూవీ రెస్పాండ్ అయ్యింది. ఏకంగా మూవీ హీరో శ్రీవిష్ణునే ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరి మనోభావాలను కించ పరిచే ఉద్దేశం లేదని.. జస్ట్ సరదాగా సోషల్ మీడియాలో ఎక్కువగా వాడే పదాలను మాత్రమే వాడానని.. అంతే తప్పితే ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. అంతేకాదు ఇదే రంగంలో ఉంటూ.. ఇదే రంగంలో ఉన్న మరోకరిని ఎందుకు తక్కువ చేసి చూస్తానన్నారు. అంతేకాదు ఆ పదాలను, సంభాషణలను సినిమా నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు.
ఇక ఇదే సమయంలో బన్నీ వాసు మరో కాంట్రవర్సీకి ఆజ్యం పోసేలా ఓ పోస్ట్ పెట్టారు. ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది. అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది. శాంతి… శాంతి… శాంతి అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇది కూడా సింగిల్ వివాదంపైనే అని అర్థమవుతోంది.