మూలామ్నాయ సర్వజ్ఞ పీఠం, వేదాభ్యాస కేంద్రం శ్రీ కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారి నియామకం జరుగనుంది. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి క్షేత్రానికి చెందిన సలక్షణ ఘనాపాఠి ఋగ్వేద పండితుడు శ్రీ దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రవిడ్ ను శ్రీ కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా పట్టాభిషిక్తుడ్ని చేయనున్నారు. ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ రోజున శ్రీ గణేశ శర్మ సన్యాస దీక్షను స్వీకరించనున్నారు. అనంతరం కాంచీపురంలో శ్రీ కంచి కామకోటి పీఠాన్ని స్ధాపించిన జగద్గురు ఆదిశంకరాచార్యుల 2534వ జయంతి మహోత్సవమైన మే 2వ తేదీన గణేశ శర్మను కంచి పీఠానికి ఉత్తరాధికారి నియమాక కార్యక్రమం జరుగుతుంది. అన్నవరం దేవస్ధానంలో ఋగ్వేద పండితుడై గణేశ శర్మ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్ధానంలో కూడా సేవలందించారు. గణేశ శర్మ 2006లో వేద విద్యను ప్రారంభించిన నాటి నుంచి శ్రీ కంచి కామకోటి పీఠానికి చెందిన పూజ్య శ్రీ శంకరాచార్య స్వామివారి ఆశీస్సులు, అనుగ్రహం ఆయనకు లభించింది. కంచి స్వామి వారి అనుగ్రహంతో శ్రీ గణేశ శర్మ ఋగ్వేదంతో పాటు యుజుర్వేదం, సామవేదం, షడంగలు దాషపనిషత్తుల అధ్యయంన పూర్తి చేశారు. ప్రస్తుతం కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతిగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కొనసాగుతున్నారు. జగద్గురు పరంపరలో కంచి పీఠం 71వ పీఠాధిపతిగా అర్హత పొందేందుకు శ్రీగణేశ శర్మ ద్రవిడ్ ఉత్తరాధికారిగా నియామకం కానున్నారు.