శిధిలాల కింద మరికొందరు చిక్కున్నట్లు అనుమానం
దేశ రాజధాని న్యూఢిల్లీ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఐదు అంతస్తుల భవనం కుప్పకూలి నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఢిల్లీ సబర్బన్ ప్రాంతమైన ముస్తఫాబాద్ లో ఓ భవనం కూలిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శనివారం ఉదయానికల్లా నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. దాదాపు ఇంకో 12 మందికి పైగా శిధిలాల కింద చిక్కుకున్నట్లు రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. స్థానికుల కధనం ప్రకారం ఆ భవనంలోని ఒక ఫ్లాట్ లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని వారిలో ఆరుగురు చిన్న పిల్లలే ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే వీరెవరి సమాచారం ఇంకా తెలియలేదు. వాస్తవానికి నిన్న ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ప్రభావంతోనే భవనం కూలి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో భవనం కూలిన సంఘటన జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిధిలాలను తొలగించే పనిలో ఉన్నాయి.