-
పాత వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలు
పాత వాహనాలు ఉన్న ఢిల్లీ వాసులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలనే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై పదేళ్లు దాటిన పాత వాహనాలకు డీజిల్ అందుబాటులో ఉండదు.
ఢిల్లీ రవాణా శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం.. 10 సంవత్సరాలు దాటిన పాత డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. అలాగే, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్, సీఎన్జీ వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా రద్దవుతాయి. ఇలాంటి వాహనాలు ఢిల్లీలో 55 లక్షలకు పైగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ జోన్లో రిజిస్టర్ అయిన వాహనాలకు ఈ కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జారీచేసిన నిబంధనల మేరకు ఇకపై పెట్రోల్ పంపుల వద్ద వాహనాలకు పెట్రోల్గానీ, డీజిల్ గానీ పోయరు. ప్రభుత్వ నిర్ణయం మేరకు 477 పెట్రోల్ బంకుల్లో వాహనాల వివరాలను స్కాన్ చేసే సాంకేతిక వ్యవస్థ అమలులోకి రానుంది. వాహనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ రికార్డుల్లో ఉన్నట్లయితే, పెట్రోల్, డీజిల్ పోయడానికి బంకుల్లో నిరాకరిస్తారు.
అంతేకాదు.. పాత వాహనాల విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. పాత వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేయడం నిషేధించారు. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.5,000 నుంచి రూ.10,000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఆ వాహనాన్ని జప్తు చేసే అవకాశం కూడా ఉంది.
ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో వాహన యజమానులకు ఉన్న ప్రత్యామ్నాయాలు చూస్తే.. వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే.. ఒక యేడాది లోపు ఎన్ఓసీ తీసుకోవాలి. ఇక, వాలంటరీగా స్క్రాపింగ్కు అంగీకరిస్తే.. కొత్త వాహనంపై టాక్స్ మినహాయింపు పొందవచ్చు.
ఢిల్లీలో ఈ నిబంధనలు ఇప్పటికే అమల్లోకి రావడంతో, వాహన యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే, పెద్ద మొత్తంలో జరిమానాలు, వాహన జప్తు వంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.