కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గోవిందుని దర్శించి పునీతులవుతారు. శ్రీనివాసుడి దర్శన సమయంలో ఎలాంటి అపచారం జరగకూడదని జాగ్రత్తపడతారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని స్వామిని దర్శించుకునేందుకు ఎదురుచూస్తారు. అలాంటి పవిత్రతతో కూడిన తిరుమల ఆలయంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. కొందరు భక్తుల నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు తిరుమల కొండపై మరో అపచారం చోటుచేసుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలు ధరించిన భక్తులు వచ్చారు. మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేసినప్పటికీ టీటీడీ విజిలెన్స్ దీన్ని గుర్తించలేకపోయింది. భద్రతా సిబ్బంది తక్షణ స్పందనలో విఫలమయ్యారు. తిరుమలలో వరుస అపచారాలు జరుగుతున్నా, టీటీడీ నిర్లక్ష్యం కొనసాగుతుండటంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో పాదరక్షలతో భక్తులు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆలయ మహాద్వారం వద్ద భద్రతా సిబ్బంది ఇది గమనించి వారిని అక్కడే నిలిపివేశారు. భక్తులు అక్కడే పాదరక్షలు విడిచిపెట్టి ఆలయంలోకి వెళ్లారు. నిజానికి, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దే భక్తులను తనిఖీ చేసి, పాదరక్షలు తీసుకోవాల్సి ఉంది. కానీ విజిలెన్స్ మరియు టీటీడీ ఉద్యోగులు సరిగా తనిఖీ చేయకపోవడంతో, వారు చెప్పులతో మహాద్వారం వరకూ వచ్చేశారు.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ప్రవేశించాల్సి ఉంటుంది. అక్కడ భద్రతా సిబ్బంది వారి వద్ద సెల్ఫోన్లు, నిషేధిత వస్తువులు, పాదరక్షలు తీసుకుని భద్రపరిచి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కానీ ఈ రోజు కొందరు భక్తులు పాదరక్షలతో మహాద్వారం వరకు వచ్చేయడం కలకలం రేపింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది వీరిని గమనించకపోవడం వల్లే, వారు ఇలా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. చివరకు మహాద్వారం వద్ద సిబ్బంది అప్రమత్తమై, భక్తులను నిలిపివేయడంతో వారు పాదరక్షలు అక్కడే వదిలిపెట్టారు.
సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై భక్తులు భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.