- ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి
- ఆపరేషన్ కగార్ లో భాగంగా దూసుకు వెళుతున్న భద్రతా దళాలు
చత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ రోజు ఉదయం సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెపుతున్నారు. సుక్మా, దంతెవాడ సరిహద్దులో ఉన్న గోగుండ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వారిపై మావోయిస్టులు కాల్పులు చేశారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఈ ఎదరు కాల్పుల్లో 20 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్లు చెపుతున్నారు. సంఘటనా స్ధలంలో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనలో మావోయిస్టు కమాండర్ జగదీష్ మృతి చెందినట్లు ప్రచారం అవుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడ లేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ నేతృత్వంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మధ్యకాలంలో చత్తీస్ఘడ్ పరిసరాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో భారీ ఎత్తున మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగానే మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా సీఆర్పీఎఫ్, డీఆర్జీ జవాన్లు అడవులను జల్లెడ పడుతున్నారు.