సిట్ విచారణకు హాజరైన కీలక నిందితుడు శ్రవణ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు ఒక ప్రైవేటు న్యూస్ ఛానల్ చైర్మన్ అరువెల శ్రవణ్ కుమార్ రావు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా ఉన్నప్పటికీ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకంగా వ్యవహరించి అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా చేశారని శ్రవణ్రావు విషయంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 29వ తేదీన సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకావాలని ఈనెల 26వ తేదీ ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే శ్రవణ్రావు అమెరికాలో ఉండటంతో సీట్ తన నోటీసులను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈలోపు ఈ కేసులో అరెస్ట్ చేయడానికి వీలు లేదని సుప్రీం కోర్టులో శ్రవణ్ రావుకు ఊరట అభించింది. కానీ విచారణకు సహకరించాలని అత్యున్న న్యాయస్ధానం ఆదేశించడంతో శ్రవణ్ రావు శనివారం అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో శ్రవణ్ రావు వాగ్మూలం కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు సూచనల మేరకే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారని సీట్ అభియోగాలు చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధులతో పాటు, వారికి ఆర్థిక వనరులు సమకూరుతున్న వ్యక్తుల ఫోన్ నెంబర్లపై కూడా నిఘా ఉంచాలని ఎస్ఐబీ అధికారులకు శ్రవణ్ రావే ఆదేశాలు ఇచ్చారని పోలీసులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయ్యింది. ఆవెంటనే శ్రవణ్రావు మొదట లండన్ వెళ్లి అక్కడ నుంచి అమెరికా వెళ్లిపోయారు. ఈ సంవత్సర కాలంగా సిట్ విచారణకు రాకుండా శ్రవణ్ రావు అమెరికాలోనే ఉండిపోయారు. ఇటీవలే పోలీసులు శ్రవణ్రావుపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చెయ్యగా కోర్టు ఆయన పిటీషన్ని తిరస్కరించింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసి ఊరట పొందిన శ్రవణ్ శనివారం సిట్ ముందుకు విచారణకు హాజరయ్యారు.