ఆయకట్టు పంటలకు, తాగు నీటికి పొంచివున్న ప్రమాదం
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు ప్రధాన సాగునీటి వనరు అయిన నాగార్జున సాగర్ జలాశయం నీటి లభ్యత లేక అడుగంటి పోతోంది. వ్యవసాయ, విద్యుత్ ఉత్పత్తి రంగాలకు ప్రాణం పోసే బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ డెడ్స్టోరేజ్ కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 22 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే కాకుండా హైదరాబాద్ మహా నగరానికి అనేక జిల్లాలకు తాగు నీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ విషయంలో తక్షణం కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి సాగర్ పూర్తి స్ధాయి నీటి మట్టం 59 అడుగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 519 అడుగులకు దిగిపోయింది. డామ్ నిల్వ సామర్ధ్యం 312 టీఏంసీలుకు గాను 148 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇదే వరవడి కొనసాగి 510 అడుగుల కనిష్ట నీటి మట్టానికి సాగర్ జలాశయం చేరితే సాగు, తాగు నీటి అవసరాలకు నీటి లభ్యత కష్టతరమైపోతుంది.
సాగర్ డ్యామ్ లో నీరు కనిష్ఠ నీటి మట్టానికి చేరువవ్వడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కే ఆర్ ఎం బి ఆదేశాల మేరకు వార బంది పద్దతిలో సాగర్, ఎడమ, కుడి కాలువల ద్వారా పంటలకు నీటిని అందిస్తున్నాయి. నీటి కొరత తో కృష్ణ పట్టె ప్రాంతంలోని ఆయకట్టు పంటల భవితవ్యం ప్రశ్నర్ధకంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో సమయానుకూలంగా, పంటలకు సాగునీటి విడుదలలో కుడి, ఎడమ కాలువల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణలో ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగు నీరు సరఫరా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సమర్థవంతంగా నీరు విడుదల అవుతోంది.