హైదరాబాద్లో వేసవి ఆందోళన మెుదలయ్యింది. ఎండా కాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడటం సర్వ సాధారణంగా మారింది. గడిచిన యేడాది చాలామంది ట్యాంకర్లతో నీటికి తెప్పించుకున్నారు. ఈ యేడాది కూడా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఇప్పుడే ట్యాంకర్లతో నీటిని తెప్పించుకోవడం మొదలయ్యింది. కొందరు ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీరడం లేదు. బస్తీల్లో అయితే నీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మాన్సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి నీటిని తరలించేందుకు ప్రస్తుతం ఉన్న కాండ్యూట్కు సమాంతరంగా మరో పైపులైను ఏర్పాటుకు రెడీ అయ్యారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉస్మాన్సాగర్ నుంచి అదనంగా నీటిని తరలించేందుకు వీలుగా క్యాండూట్కు సమాంతరంగా కొత్త పైపులైన్ను ప్రతిపాదించారు. దాదాపు 14.5 కిలోమీటర్ల పొడవున కొత్త పైపులైన్ వేయడానికి జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సుమారు వందేళ్ల క్రితం ఉస్మాన్సాగర్ నుంచి రోజుకు 25 ఎంజీడీల నీటిని తరలించే సామర్థ్యంతో పాత కాండ్యూట్ను నిర్మించారు. అప్పటి నుంచి నగర అవసరాలకు కాండ్యూట్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. ముందుగా ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్కు నీరు చేరుతుంది. అక్కడ జలాలు ఫిల్టర్ చేసి ఆ తర్వాత నగరంలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కాండ్యూట్ పాతది కావడంతో పాటు దానికి లీకేజీలు భారీగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం జలమండలి కాండ్యూట్కు మరమ్మతులు చేస్తోంది. రిపేర్లు పూర్తయి లీకేజీలను అరికడితే అదనంగా మరో రెండు ఎంజీడీల నీరు నగరవాసుల అవసరాలకు అందుబాటులోకి వస్తుంది. పాత కాండ్యూట్ను కొనసాగిస్తూనే.. కొత్తగా ఉస్మాన్సాగర్ నుంచి మరో పైపులైన్ అంశాన్ని మంచి అవకాశంగా జలమండలి భావిస్తోంది. కొత్తగా నిర్మించే పైపులైన్ను ఇప్పుడున్న సామర్థ్యంతోనే ఏర్పాటు చేయాలా.. లేదంటే అవసరాల మేరకు సామర్థ్యం పెంచాలా? అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉస్మాన్సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా సరఫరా కానుండటంతో అతి తక్కువ వ్యయంతో హైదరాబాద్ నగరానికి నీరు అందుబాటులోకి రానుంది. ఇదే జరిగితే సమ్మర్లో నీటి కష్టాలు తీరనున్నాయంటున్నారు.