తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవి సమయంలో విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్, తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవిలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. యాత్రికుల అవసరాలను తీర్చడానికి తగినంత లడ్డూల బఫర్ స్టాక్ను ఉంచాలని ఆలయ అధికారులకు సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులను ఆదేశించారు. రాబోవు వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, భాస్కర్, ట్రాన్స్ పోర్ట్ జీఎం శేషారెడ్డి, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.