అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ (AMGEN) హైదరాబాద్ లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింది. హైటెక్ సిటీ సమీపంలో ని అమ్జెన్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించారు. అమ్జెన్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఎ. బ్రాడ్వే, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, అమ్జెన్ ఇండియా ప్రతినిధి సోమ్ చటోపాధ్యాయ, అమ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుల్లపల్లి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సంస్ధ విస్తరణలో భాగంగా అమ్జెన్ సంస్ధ ప్రస్తుత సంవత్సరం దాదాపు 1600 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనుంది. రాబోయే సంవత్సరాల్లో అమ్జెన్ సంస్ధ పెట్టుడులు మరింత భారీగా ఉండేలా ప్రణాళిక చేస్తోంది. అమ్జెన్ సంస్ధ విస్తరణ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో బయో ఫార్మా రంగంలో మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అమ్జెన్ తమ ఔషధాల శ్రేణిని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరిస్తుందని అమ్జెన్ ఇండియా ఎమ్డీ రాబర్ట్ బ్రాడ్ వే తెలిపారు. ఏఐ, డేటా సైన్స్ తో డిజిటల్ సామర్థ్యాలను ఈ కొత్త సైట్ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.