గ్రేటర్ హైదరాబాద్ అధికారుల తీరు ఎప్పుడూ చర్చనీయాంశమే అవుతూ ఉంటుంది. పాలకవర్గంలోని పెద్దలపైనా చర్చ సర్వ సాధారణమే. ఎప్పుడూ ఏదో ఒక నిబంధనల ఉల్లంఘన, విలాసాలకు సంబంధించిన అంశం బయటికి వస్తూనే ఉంటుంది. దీనికి ఏ స్థాయి అధికారి అయినా అతీతం కాదన్న చర్చ జోరుగా సాగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరవాసులకు వసతులు కల్పించడం, సేవలు అందించడం ఏమో గానీ.. ఫుల్ జల్సా చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎవరైనా అధికారులు గ్రేటర్ హైదరాబాద్కు వచ్చారంటే చాలు.. ఏసీ క్యాబిన్.. కాస్ట్ లీ ఫోన్లు.. ఏసీ కార్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారట. ప్రభుత్వ కార్లను సొంతకార్లలాగా వాడుకుంటున్నారన్నట. గ్రేటర్ లిమిట్స్లోనే కాదు సిటీ పరిధి దాటి వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వ కార్లనే వాడుతున్నారని చెబుతున్నారు. ప్రతిరోజు 50 కిలోమీటర్లు తిరగకపోయినా 100 కిలోమీటర్లకుపైగా తిరిగినట్లు డీజిల్ కూపన్లు యూజ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గడపదాటకపోయినా మేయర్, డిప్యూటీ మేయర్ల వాహనాలకు కూడా వందల లీటర్ల డీజిల్ వాడుతున్నట్లు లెక్కలు చూపుతున్నారట. ప్రతి రోజు 15 లక్షల రూపాయలకుపైగా డీజిల్ ఖర్చు చూపెడుతున్నారని బల్దియా కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. హాలీడే రోజు కూడా డీజిల్ ఖర్చు అవుతున్నట్లు లెక్కలు చూపుతున్నారట బల్దియా అధికారులు.
ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న డబ్బులను బల్దియా అధికారులు నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా, తమ డిపార్ట్మెంట్ కాకపోయినా, గ్రేటర్లో తిష్ట వేస్తున్న కొంతమంది ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారట. ఒకసారి బల్దియాకు వచ్చారంటే చాలు.. ఏసీ క్యాబిన్లు, వేల రూపాయల ఫోన్లు, లక్షల రూపాయల విలువ చేసే కార్లు కావాల్సిందే అంటూ తమ కోరికల చిట్టా విప్పుతున్నారట. బల్దియాలో కార్లతో పాటు ప్రైవేటు కార్లు దాదాపు 750 వరకు ఉన్నాయి. వీటి కోసం ప్రతి నెలా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఇన్నోవాలు, స్కార్పియోలు, బొలెరోలు ఉన్నాయి. వీటికి ఆయా విభాగాల అధికారులకు 200 నుంచి 280 లీటర్ల డీజిల్ ప్రతి నెల సమకూరుస్తారు. ఇందులో చాలామంది ఇంటికి ఆఫీసుకు మాత్రమే కార్లను వాడుతుంటారు. అందుకోసం వారు ప్రతి రోజు 30 నుంచి 50 కిలోమీటర్లలోపు మాత్రమే తిరుగుతారు. కానీ, 100 కిలోమీటర్ల దూరం తిరిగినట్లుగా డీజిల్ కూపన్స్ వాడుతున్నారట. అయితే.. తిరిగిన కిలోమీటర్ల రీడింగ్ బట్టి కాకుండా.. అధికారులు చెప్పే కిలోమీటర్ల లెక్కకే డీజిల్ ఇవ్వడంతో అక్రమాలు జరుగుతున్నాయట. ఎన్ని కిలోమీటర్లు తిరిగారని లెక్కేయకుండా.. వాళ్లు చెప్పిన దానికి ఇష్టం వచ్చినట్లు డీజిల్ కూపన్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
బల్దియా సమకూర్చిన ఈ కార్ల సౌకర్యాన్ని కొంతమంది అధికారులు తమ టూర్లకు వెళ్లేందుకు కూడా వాడుకుంటున్నారట. ఇక గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్కు కూడా ప్రతినెలా 1000 లీటర్ల డీజిల్ వరకు వాడుకునే అవకాశం ఉంది. అయితే, ఇందులో ఐఏఎస్ అధికారులు సరైన పద్ధతుల్లో వాహనాలను వాడుతున్నప్పటికీ.. మేయర్, డిప్యూటీ మేయర్లు ఎక్కడికి తిరగకపోయినా ఫుల్ డీజిల్ కూపన్లను యూజ్ చేస్తున్నట్లుగ్రేటర్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న రోజుల్లో కూడా ఈ ప్రజాప్రతినిధులు 800 నుంచి 900 లీటర్ల డీజిల్ యూజ్ చేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. మేయర్, కమిషనర్ పేషీల్లో పనిచేస్తున్న కిందిస్థాయి అధికారులకు కూడా కారు సౌకర్యం కల్పించడం చర్చనీయాంశం అవుతోంది. ఇక నగర పౌరుల సేవల కోసం కేటాయించిన కార్లను కొంతమంది అధికారులు తమ కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారన్నట. ఆ కార్లతో ఔటర్ రింగ్ రోడ్డు దాటి జిల్లాల్లో కూడా తిరిగిన అధికారులు ఉన్నారట. సెలవు రోజుల్లోనే కాదు వర్కింగ్ డేస్లో కూడా సిటీ లిమిట్ దాటి తిరుగుతున్నారట. గ్రేటర్ కార్లకు వేరే జిల్లాల్లో ఓవర్ స్పీడ్, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ చలాన్లు క్రియేట్ అవుతున్నాయంటే.. అధికారులు ఏ రేంజ్లో కార్లను మిస్ యూస్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంతటితో మాత్రమే ఆగకుండా కొంతమంది అధికారులు బల్దియాకు రాగానే తమ సొంత కారును అద్దె కారుగా మార్చుకుంటున్నారట. గ్రేటర్లో పనిచేసినన్నీ రోజులు ఆ కారుకు ఎంచక్కా అద్దె రూపంలో డబ్బుల్ని తమ జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వీటిన్నింటిని గుర్తించిన కమిషనర్ ఇలంబరితి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ అధికారులకు నోటీసులు ఇచ్చారు. అయితే, అధికారులు ఇచ్చే వివరాల ఆధారంగా బల్దియా కమిషనర్ ఎలా స్పందించబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది.