ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసులో ఏం ఉంటుందో.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు ఆలోచనా తీరుపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చను లేవనెత్తింది. ఇంతకాలం సాగుతున్న రచ్చ ఇందుకేనా? అన్న భావనను కూడా రాజకీయ వర్గాల్లో రేకెత్తిస్తోంది.
విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. వంశీని జైలులో పరామర్శించిన తర్వాత వైఎస్ జగన్ జైలు ముందే మీడియాతో మాట్లాడారు. వంశీని అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ వివరంగా మాట్లాడారు. పలు అంశాలను కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు తనతో పాటు.. ఆయన కుమారుడు నారా లోకేష్ ఇద్దరే అందగాళ్లని అనుకుంటారట. కానీ, చంద్రబాబు కన్నా వల్లభనేని వంశీ అందగాడన్నారు వైఎస్ జగన్. అంతేకాదు.. నారా లోకేష్ కన్నా అవినాష్ అందగాడని జగన్ చెప్పారు. కానీ, చంద్రబాబుకు ఇది గిట్టదని, తన సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎదిగితే చంద్రబాబు తట్టుకోలేడని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, శంకర్రావు, బ్రహ్మనాయుడు, అవినాష్ వంటి నాయకులు ఎదుగుతున్నారని, తమ ముందే వాళ్లు అంతలా ఎదుగుతూంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నాడని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చను లేవనెత్తాయి.