న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో శనివారం రాత్రి జరగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందగా మరో 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. మహాకుంభమేళాకు వెళ్ళే ప్రయాణికులతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ శనివారం ప్రయాణికులతో అత్యంత రద్దీగా మారింది. ముఖ్యంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 12, 13, 14 నెంబర్ ఫ్లాట్ఫారమ్లలో మహాకుంభ్ మేళాకు వెళ్ళే భక్తులు వేలాదిగా జమ అవ్వడంతో వారు రైళ్ళలోకి ఎక్కే క్రమంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. మహాకుంభ్ మేళా ప్రారంభమైన నాటి నుంచి రైల్వే శాఖ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్లను ప్రయోగ్రాజ్కు నడుపుతోంది. మరో పది రోజుల్లో మహాకుంభ్ మేళా ముగియనుండటం పైగా వారంతపు సెలవులు ఉండటంతో కుంభ్మేళాకు వెళ్ళే భక్కుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ కారణంగా శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషణ్ అడుగు కూడా పెట్టడానికి వీలు లేనంతగా ప్రయాణికులతో కిటకిటలాడింది. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ అత్యున్నత స్ధాయి విచారణకు ఆదేశించింది.
ప్రధాని విచారం
శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి పద్దెనిమిది మంది మృతి చెందడం, పలువురికి గాయలవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సెక్సేనా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తొక్కిసలాట పట్ల విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయని మరణాలను మోదీ ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం అత్యంత సిగ్గుచేటని ఆయన విమర్శించారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించేందుకు ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని ఖర్గే అధికారులకు సూచించారు.
తొక్కిసలాటకు కారణం…
ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రెండు రైళ్లను చివరి నిమిషంలో రద్దు చేయడంతో ప్రయాణికుల సంఖ్య ఊహించని విధంగా పెరగి తొక్కిసలాట జరిగినట్లు ప్రయాణికులు చెపుతున్నారు. రైళ్ళు రద్దు చేసిన ఫలితంగా ప్లాట్ఫామ్లపై రద్దీ పెరిగడంతో భద్రతా సిబ్బంది జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. ఈ కారణంగా ప్రయాణికులకు ఊపిరాడకపోవడంతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఒక గంటలో సుమారు 1,500 జనరల్ టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఇది కూడా తొక్కిసలాటకు కారణమయ్యిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రైల్వే) కెపిఎస్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.
ఎన్నడూ చూడని జనం
శనివారం జరిగిన తొక్కిసలాటపై ఒక రైల్వే కూలీ మాట్లాడుతూ తాను 1981వ సంవత్సరం నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీగా పని చేస్తున్నానని ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంతటి జనసమూహాన్ని నేను చూడలేదని అతను వాపోయాడు. ప్రయోగ్రాజ్కు వెళ్ళే స్పెషల్ ట్రైన్లు 12వ నెంబరు ప్లాట్ఫారమ్ నుంచి బయలుదేరతాయని కానీ శనివారం అకస్మాత్తుగా 16వ నెంబరు ప్లాట్ఫారానికి మార్చడంతో 12వ నెంబరు ప్లాట్ఫారమ్ మీద ఉన్న ప్రయాణికులు, బయట ఉన్న ప్రయాణికులు 16వ నెంబర్ ప్లాట్ఫారమ్కు వెళ్ళడానికి ఒకే సారి పూనుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు ఆ కూలి చెపుతున్నారు.