తెలంగాణ కులగణనపై పూర్తిగా రాహుల్ గాంధీకి వివరించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పూర్తి శాస్త్రీయంగా కులగణన చేశామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈ రోజు రాహూల్ గాంధీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు.
రేవంత్ రెడ్డి చిట్ చాట్ ముఖ్యాంశాలు
తెలంగాణలో బహిరంగ సభ ఉంటుంది, దానికి రావాలని రాహుల్ గాంధీని కోరాను. రాహుల్ గాంధీ చెప్పిన ఆదేశాలను ఫాలో అయ్యాను. తెలంగాణ రాష్ట్ర కులగణన దేశానికి రోడ్ మ్యాప్ అవుతుంది. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయి. రాజకీయ కోణంలో కాదు ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగింది. విపక్షాలు ప్రజలను ఉద్రేకపరిచే ప్రయత్నం చేస్తున్నాయి
కులగణనలో ఎక్కడ లెక్క తప్పలేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు తీసుకొస్తాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే, కేటీఆర్ ఏదేదో చెప్తున్నాడు. సభిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారు.
ప్రధానిని కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. బిజెపి నేతలు సైతం అదే విషయాన్ని ధృవీకరించారు.. ఒప్పుకుంటున్నారు. నేను కొందరికి నచ్చకపోవచ్చు. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు. కానీ నా పని నేను చేస్తున్నాను. నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను..అమలు చెయ్యక పోతే అడిగేది నన్నే..కొంతమంది నాపై అబద్ధపు ప్రచారాలు చేసి , పైశాచిక ఆనందం పొందుతున్నారు. క్యాబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదు. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలను నేను పట్టించుకోను. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారు.