- మార్సెలెలో భారత సిపాయిలకు ప్రధాని శ్రద్ధాంజలి
- వీర్ సావర్కర్ సాహసాన్ని కొనియాడిన మోడీ
- సావర్కర్ గ్రేట్ ఎస్కేప్ సాహసంపై ప్రశంసలు
- పలు కీలక అంశాలపై ముఖా ముఖీ చర్చలు
- కీలక ఒప్పందాలపైచర్చలు కొలిక్కి
- భారత కాన్సులేట్ కార్యాలయం ప్రారంభం
- ఏఐ రంగంలో సహయా సహకారాలకు అంగీకారం
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈసాయంత్రం ఫ్రాన్స్ లో పర్యటన పూర్తి చేసుకుని అమెరికా బయల్దేరుతున్నారు. ఈనెల 10న అంటే రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ వెళ్లిన మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో పలుఅంశాలపై కీలక చర్చలు జరిపారు.మూడురోజుల పర్యటన ఇవాళ ముగింపుకు రావడంతో మార్సెలేలో ఉన్న చరిత్రాత్మక మజార్గస్ సిమెట్రీని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు.
వీర్ సావర్కర్ పై ట్వీట్
మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని వీర మరణం చెందిన భారత సిపాయిలను అక్కడే ఖననం చేశారు. స్వాతంత్ర్యం కోసం భారత్ సాగించిన పోరాటంలో మార్సెలె నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వాతంత్ర్య సంగ్రామ వీరుడు వీర్ సావర్కార్ ఇక్కడినుంచే తప్పించుకునేందుకు వీరోచితమైన సాహసానికి ఒడిగట్టారు అని ప్రధాని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.వీర్ సావర్కర్ ను ఆ సమయంలో బ్రిటీష్ ఆర్మీకి అప్పగించకుండా రహస్యంగా రక్షించిన ఫ్రెంచ్ ఉద్యమకారులు,ప్రజలకు ప్రత్యేక వందనాలు అంటూ మోడీ ట్వీట్ చేశారు.వీర్ సావర్కర్ సాహసం, ధైర్యం అన్ని తరాల వారికి ఆదర్శప్రాయమని కొనియాడారు.
ఇండియన్ కాస్సులేట్ ప్రారంభోత్సవం
మార్సెల్లె చేరుకున్న ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో రెండు దేశాలకు చెందిన అనేక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు, వాణిజ్య ఒప్పందాల ప్రతిపాదనలను ప్రస్తావించారు. భారత కాన్సులేట్ ప్రారంభంతో రెండు దేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయన్నారు.
ఘనస్వాగతం
అంతకుముందు మార్సెలే చేరుకున్న ప్రధానికి అక్కడి హోటల్ ముందు స్థానిక భారతీయులు ఘన స్వాగతం పలికారు. నాలుగేళ్ల నుంచి ఫ్రాన్స్ లో ఉంటున్న తాను ప్రధాని రాకతో మళ్లీ భారత్ కు వెళ్లిన అనుభూతి కలిగిందని ప్రియాంకా శర్మ అనే యవతి కామెంట్ చేశారు.
భారత్ సహకారం
మోడీ, మెక్రాన్ లు ఇంటర్నేషనల్ థెర్మోన్యూక్లియర్ ఎక్స్ పరిమెంటల్ రియాక్టర్ ను కూడా సందర్శించారు. ఆ ప్రాజెక్టు కోసం భారత్ 17,500 కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని ఫ్రాన్స్ కు వాగ్దానం చేసింది. మొత్తం ప్రాజెక్టు కాస్ట్ లో అది పదిశాతం ఖర్చు.అలాగే యునీక్ రియాక్టర్ మొత్తాన్ని సంరక్షించే ప్రపంచంలోకే అతిపెద్ద రిఫ్రిజిరేటర్ ఏర్పాటుకు సంబంధించిన కీలక భాగాన్ని భారత్ అందించేందుకు ముందుకొచ్చింది.
చరిత్రాత్మక సందర్భం
మార్సెలేకు ఇరు దేశాల అధిపతులు ఒకే విమానంలో ప్రయాణించడమే కాదు అనేక కీలక చర్చలు కూడా ఆ సమయంలో నిర్వహించారు. ఇది భారత, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయనడానికి నిదర్శనం అని ప్రధాని టీమ్ లో ఉన్నవిదేశాంగ శాఖ అధికారి కామెంట్ చేశారు.
కీలక రంగాల్లో చర్చలు
రెండు దేశాల నేతలు రక్షణ, అంతరిక్ష, పౌర విమాన యాన రంగాలు, ఆర్టిఫీషియల్ఇంటెలిజెన్స్, వైద్య ఆరోగ్య రంగాలపై సహకారం కోసం కీలక చర్చలు జరిపారు. మోడీ, మెక్రాన్ లు కలసి ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026 లోగోను విడుదల చేశారు.
మోడీ భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం ఫ్రాన్స్ నుంచి అమెరికా బయల్దేరతారు. ఈపర్యటన ముగిసేముందు ఇరుదేశాధిపతులు ఒక జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేసే అవకాశముంది.