- తొక్కిసలాటల నివారణకు కొత్త ప్లాన్
- 5 లక్షల వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు
- నిబంధనలు కఠినతరం…
- రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు
- ఉన్నతాధికారులతో యోగీ మీటింగ్…
రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రయాగ్రాజ్ లో ట్రాఫిక్ జామ్లను నివారించేందుకు మహాకుంభమేళాకు ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు, కొత్త ప్రణాళికను అధికారులు ప్రకటించారు. పవిత్రస్నానాలకు వచ్చే భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాన్ని సూచించారు.మహా కుంభమేళాలో వచ్చే ఆరు పవిత్ర ఘడియల్లో ఐదోదైన మాఘపౌర్ణమి చాలా చాలా విశిష్టమైనది. ఈ పుణ్య ఘడియల్లో స్నానం చేసి, తర్పణాలు వదిలేందుకు ప్రపంచం నలుమూలలనుంచి భక్తులు వస్తున్న నేపధ్యంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. ఈ ఆంక్షలు ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి. ఉదయం నాల్గింటినుంచే కుంభమేళా పరిసరాల్లో నో వెహికల్ జోన్ నిబంధన అమల్లోకి వచ్చింది. చాలా ప్రాంతాన్ని ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. బయటి నుంచి వచ్చే వారికోసం నగరం నలుమూలల పలు పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. కోట్ల మంది రాకతో తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు ఈఏర్పాటు చేశారు. భక్తులు నిర్దేశిత రూట్ లో వచ్చి కేటాయించిన చోట వెహికల్ పార్కింగ్ చేసుకుని అక్కడనుంచి నడచి వచ్చి ఘాట్ ల దగ్గర పవిత్రస్నానాలు చేయాలి. తమ పనిపూర్తి చేసుకుని మరో రూట్ నుంచి తమ పార్కింగ్ కు చేరుకుని వెహికల్ తీసుకుని వెళ్లాలి. ఈ నిబంధనలు రేపు పౌర్ణిమ ఘడియలు పూర్తయ్యే వరకూ అమల్లో ఉంటాయి. ఇవి కల్పవసీలు అంటే కుంభమేళాలో కొన్ని రోజులు ఉండాలనుకునే వారికి కూడా వర్తిస్తాయి.
సీఎం యోగీ ఆదిత్య నాధ్ నిన్న ఉన్నతాధికారులతో భేటీ అయి నగరంలో క్రమబద్ధమైన ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ మేనేజ్ మెంట్ పద్ధతులపైనా చర్చించారు. దాదాపు 5 లక్షల వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉందని భక్తులందరూ కఠినమైన ఆదేశాలు పాటిస్తూ నియమబద్ధంగా నడచుకొని పుణ్యస్నానాలు చేసి వెనక్కు మరలాలని యోగీ కోరారు. ఏది ఏమైనా రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడానికి వీల్లేదని, వాహనాలు క్యూలో నిలబడి ప్రయాణించే దురవస్థ లేకుండా చూడాలని కూడా యోగీ ఆదేశించారు. గతనెల 29న మౌనీ అమావాస్య సందర్భంగా షాహీ స్నాన్ సందర్భంగా తొక్కిసలాటకు 30 మందికి పైగానే మరణించడం వల్ల ఈసారి కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.
బారికేడ్లు విరిచేసి…
భక్తులు క్రమపద్ధతిలో బారికేడ్ల ద్వారా స్నానఘట్టాలకు చేరుకునేలా అప్పట్లో ఏర్పాట్లు చేసినా జనం ఎక్కువ రావడంతో బారికేడ్లు విరిచేసి, వాటిపైనుంచి దూకేసి తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆ ఘటన వీడియో ఫుటేజ్ లో బయటపడింది.