విజయ్ మాల్యా మరోసారి న్యాయపోరాటానికి దిగారు. అసలు తాను చేసిన అప్పుకు రెట్టింపు వసూలు చేశారు.. ఇంకెంత కాలం ఇలా వసూలు చేస్తారంటూ ఏకంగా కోర్టును ఆశ్రయించారు. అసలు నేను చేసిన అప్పెంత.. ? దానికి మీరు రికవరీ చేసిందెంత? ఈ లెక్కలు చెప్పాలంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు విజయ్ మాల్యా. ఆర్థిక నేరాలు చేసి 2016లో విదేశాలకు పారిపోయిన మాల్యా.. అసలు ఏయే బ్యాంక్ ఇప్పటి వరకు తన వద్ద ఎంతెంత రికవరీ చేశారో స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు.
మాల్యా పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. 10 బ్యాంక్లకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్లు కూడా ఉన్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రూ.6,200 కోట్ల రుణం తీసుకుంటే.. ఇప్పటి వరకు రూ.14,000 కోట్లకు పైగా వరకు రికవరీ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాల్యా నుంచి 10 వేల 200 కోట్లు రికవరీ అయ్యాయని లోక్సభకు తెలిపారని.. రుణం.. దానికి వడ్డీ చెల్లించినా కూడా ఇప్పటికీ కూడా రికవరీ ప్రాసెస్ కొనసాగుతుంది.. ఇవీ మాల్యా తరపున వాదిస్తున్న సాజన్ పూవయ్య అనే న్యాయవాది కోర్టులో వినిపించిన వాదనలు.
అంతేకాదు ఇకపై జరిగే రికవరీపై స్టే విధించాలని కోర్టును కోరారు మాల్యా. అంతేకాదు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ హోల్డింగ్ కంపెనీ అయిన యునైటెడ్ బ్రేవరేజేస్ హోల్డింగ్స్ నుంచి రికవరీ చేసిన నిధుల స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇప్పుడే కాదు చాలా రోజులుగా మాల్యా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. తాను తీసుకున్న 6 వేల 203 కోట్ల రుణానికి రెట్టింపు మొత్తాన్ని రికవరీ చేశారని.. అయినా కానీ తనను ఆర్థిక నేరస్థుడని ఎలా అంటారంటున్నారు. సీబీఐ కూడా ఎందుకు కేసు నమోదు చేసిందో ఇప్పటి వరకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు.