- గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముఖాముఖి.
- ఎమ్మెల్యేలతో భేటీ కానున్న దీపా దాస్ మున్షి, రేవంత్ రెడ్డి.
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత.
- తీన్మార్ మల్లన్న పై చర్యలకు రంగం సిద్ధం.
- సీఎం క్లాస్ తీసుకుంటారని ప్రచారం.
- వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని ఆదేశం.
- పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు
పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపైనా… కొందరు ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయాలపై నేరుగా ఎమ్మెల్యేలతో మాట్లాడాలని అధిష్టానం ఆదేశించడంతో ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. అందరూ ఎమ్మెల్యేలతో ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ భేటీ కానున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు ఎమ్మెల్యే లతో ముఖాముఖీ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ ముంన్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే లతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇటీవల కాలంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి తమకు నిధుల కేటాయింపుల్లో అదే విధంగా కాంటాక్ట్ల విషయంలో అన్యాయం జరుగుతోందన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఒక మంత్రిపై బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. మరోవైపు బిఆర్ఎస్ నుంచి చేరిన కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి ఇబ్బందికరమైన ప్రకటనలు చేస్తున్నారని సీనియర్లు అంటున్నారు. దానం నాగేందర్ కామెంట్స్ పై కూడా చర్చ జరిగింది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లైన్ క్రాస్ అవుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరుపై కూడా అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఆయన తరచు చేస్తున్న కామెంట్లు ఏమాత్రం పార్టీ విధానాలకు అనుకూలంగా లేవని దీనిపైన కూడా దృష్టి సారించారని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశించింది. మాజీ మంత్రి సీనియర్ నేత జానారెడ్డిని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర నాయకత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా సీరియస్ గా ఈ విషయంపై కొంతమంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కంట్రోల్ చేసే విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.