అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తన చేతికి, నోటికి నాన్స్టాప్గా పని చెబుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తూనే.. మరోవైపు వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్గా నిలుస్తున్నారు. లెటెస్ట్గా ఆయన నోటి నుంచి వచ్చిన సంచలన వ్యాఖ్య.. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది.. అభివృద్ధి చేస్తుంది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు ట్రంప్. ఆ భేటీ తర్వాత ఈ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో గాజా తీవ్రంగా నష్టపోయింది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అక్కడి ప్రజలకు ఉద్యోగాలు కల్పించవచ్చన్నారు ట్రంప్. అంతేకాదు ఈ నిర్ణయం చరిత్రను మారుస్తుందన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న బాంబులు, ఆయుధాలను నాశనం చేసి.. కూలిన బిల్డింగ్లను తిరిగి నిర్మిస్తామన్నారు.
నిజానికి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉన్నట్టు కనిపిస్తోంది. గాజా నిరాశ్రయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని సూచించారు ట్రంప్. కానీ ఆయన విజ్ఞప్తిని కొట్టిపారేశాయి ఆ దేశాలు. తాము వారికి ఆశ్రయం కల్పిస్తే కొత్త ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్టు అవుతుందన్నాయి. తమ ప్రాంత స్థిరత్వం దెబ్బతింటుందని ప్రకటించాయి. దీంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని సమర్థించారు. ట్రంప్ ఔట్ ఆఫ్ ది బాక్స్లో ఆలోచిస్తున్నారని.. ఇది మంచి నిర్ణయమే అవుతుందన్నారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హమాస్. ఇది తమ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర అంటూ ఖండించింది. పాలస్తీనా ప్రజలు దీన్ని అంగీకరించరని తెలిపింది.