టీమిండియా పేస్ అటాక్ లీడ్ చేస్తున్న జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్ వన్డే సిరీస్లో ఆడేందుకు చోటు దక్కలేదు. అతని స్థానంలో ఇప్పటికే తన బౌలింగ్తో మ్యాచ్లను టర్న్ చేస్తున్న వరుణ్ చక్రవర్తికి టీమ్లో చోటిచ్చింది బీసీసీఐ. దీంతో బుమ్రా పర్ఫామెన్స్ నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలోనే చూడనున్నాం.
బీజీటీ సిరీస్ ఆఖరి టెస్ట్లో బుమ్రా గాయపడ్డాడు. తీవ్రమైన వెన్నునొప్పితో మ్యాచ్ను కూడా పూర్తిగా ఆడలేదు. నిజానికి అంతకుముందే అతనికి ఇంగ్లండ్ సిరీస్ నుంచి తప్పించి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. కానీ అనూహ్యంగా గాయపడటంతో అతని రెస్ట్ ఇప్పుడు మరికాస్త పొడిగించినట్టైంది. బుమ్రా టీ20 సిరీస్ ఆడకపోయినా.. వన్డె సిరీస్ వరకు సిద్ధంగా ఉంటాడని అంతా భావించారు. కానీ అతని గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ఎన్సీఏ లో చికిత్స తీసుకుంటున్నాడు.
మరి బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అయినా పూర్తిగా కోలుకుంటాడా? లేదా? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్గానే ఉంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలెక్ట్ చేసిన టీమ్లో బుమ్రా ఉన్నాడు. కానీ ప్లేయర్స్ను మార్చుకునే అవకాశం ఇంకా ఉంది. దీంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇక వరుణ్ చక్రవర్తి విషయానికి వస్తే వచ్చిన అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకున్నాడు. 5 టీ20ల సిరీస్లో వరుణ్ ఏకంగా 14 వికెట్లు తీశాడు. ఇక రాజ్కోట్ టీ20లో అయితే ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా వరుణ్ దక్కించుకున్నాడు. తన పర్ఫామెన్స్తో ఇప్పుడు వన్డేల్లో కూడా చోటు దక్కించుకున్నాడు. నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. ఫిబ్రవరి 9న రెండో వన్డే, 12న మూడో వన్డే జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమయ్యే సమయానికి బుమ్రా నిజంగానే కోలుకోకపోతే టీమ్ ఇండియా పేస్ బలం సగానికి సగం తగ్గిపోయినట్టే. అదే సమయంలో అతని స్థానంలో టీమ్లోకి ఎంట్రీ ఇచ్చేది వరుణ్ చక్రవర్తేనా? అనే చర్చ కూడా నడుస్తోంది.