- నాలుగు గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
- ఎయిర్ అలయెన్స్ సంస్ధపై ప్రయాణికుల ఆగ్రహం
- స్వామివారి దర్శనం కోసం వెళుతున్న 47 మంది ప్రయాణికులు
బుధవారం వేకువ జామున శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతి వెళ్ళాల్సిన ఎయిర్ అలయెన్స్ విమానం చివరి నిమిషంలో నిలిచిపోవడంతో ప్రయాణికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ అలయెన్స్91877 నెంబరు గల విమానానికి సాంకేతికలోపం తలెత్తడంతో టేకాఫ్ చేయలేకపోయారు. ఈ విమానంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి 47 మంది ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంది. వీరందరూ వేంకటేశ్వరస్వామిక దర్శనాలను ముందుగానే బుక్ చేసుకుని ఈ ప్రయాణాన్ని పెట్టుకున్నారు. అయితే సాంకేతిక కారణాలు చెప్పి 5.30 గంటలకు తిరుపతి వెళ్లాల్సిన ఎయిర్ అలయెన్స్ విమానం సర్వీసును రద్దు చేయడంతో ప్రయాణికులందరూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ఆందోళనకు దిగారు. చివరి నిమిషంలో ప్రయాణికులకు ఎయిర్ లైన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతో స్వామివారి దర్శన సమయం దాటిపోతుందని ప్రయాణికులు ఆందోళణ చెందుతున్నారు. నాలుగు గంటలుగా ప్రయాణికులు ఎయిర్ పోర్ట్లోనే పడిగాపులు పడుతున్నారు. వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడంతో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.