జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. రఘురామకృష్ణం రాజు గతంలో వైఎస్ఆర్సీపీ తరపున పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే సొంత పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలు చేశారు. వాటిలో వైఎస్.జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు చేయాలనేది ఒకటి కాగా తెలంగాణ కోర్టుల్లో ఉన్న వైఎస్జగన్ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వేసిన మరో పిటీషన్ ప్రధానమైనవి. అయితే జగన్ కేసుల బదిలీకి సంబంధించిన పిటీషన్పై గత వాయిదాలో విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అసలు ఈ కేసుకీ రఘురామకృష్ణం రాజుకీ సంబంధం ఏంటని ఆయన తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన సుప్రీం ధర్మాసనంకు సోమవారం మరోసారి విచారణకు రావడంతో వైఎస్.జగన్ కేసులను బదిలీ చేయడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. అలాగే బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముందని కూడా అభిప్రాయపడింది. కేసుల బదిలీకి సంబంధించి రఘురామరాజు వేసిన పిటీషన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అలాగే వైఎస్.జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటీషన్ని రఘురామరాజు ఉపసంహరించుకున్నారు. దీంతో జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో వేసిన రెండు పిటీషన్లలో ఆయనకు ఊరట లభించింది.