సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ ప్రకటన విడుదల చేశారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా.. ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపైనా నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు.చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నామన్నారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అయితే, సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.