స్వాతంత్రానంతరం దేశ ప్రజలకు సరిపడా ఆహారధాన్యాల ఉత్పత్తి లేకపోవడంతో భూ సంస్కరణలు తెచ్చి కొద్ది మంది చేతుల్లో ఉన్న భూమిని లక్షలాది మంది రైతులకు పంచిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని తెలంగాణ డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమారక్క కొనియాడారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. వ్యవసాయ రంగానికి అలనాటి కాంగ్రెస్ పాలకులు పెద్దపీట వేశారని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో అనేక బహుళార్ధక సాధక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులకు సాగునీరు అందించారని చెప్పారు. తెలంగాణలో కృష్ణా నదిపై నాగార్జునసాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు, జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు, గోదావరి నదిపై ఎస్సార్ఎస్పీ దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి, ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు ఆనాటి కాంగ్రెస్ పాలకులు వేసిన పునాదుల వల్లనే లక్షల ఎకరాలు నేడు సాగవుతున్నాయిని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలకుల ముందు చూపు వల్లనే ఈ సంవత్సరం వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సరం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 72 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా కేవలం 15 రోజుల్లో రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు ఒకేసారి 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేసి రుణమాఫీ చేశామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పాలిహౌస్ సబ్సిడీ విత్తనాలు తదితర పథకాలను అందిస్తూ రైతులను ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతుల కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా కాంగ్రెస్ శ్రేణులు రైతుల వద్దకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.