జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా, ఎన్నికల ఫలితాల అనంతరం పరిశీలకుడిగా అధిష్టానం నియమించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తిరుగు పయనంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రచారం సమయంలోనే ఓటర్ల నాడిని పసిగట్టి.. ఇండియా కూటమికి జార్ఖండ్ ప్రజలు ఎందుకు ఓటేయాలో స్పష్టంగా వివరించిన భట్టి విక్రమార్క.. అక్కడి ప్రజల్లో కలిసిపోయి ప్రచార పర్వంలో తనదైన వ్యూహాలను అమలు చేశారు. అధిష్టానం అంచనాలను పూర్తిస్థాయిలో నిలబెట్టారు. ఇండియా కూటమి ఘన విజయానికి బలమైన పునాదులు వేసి అపర చాణక్యుడిగా అధిష్టానంతో ప్రశంసలందుకున్నారు.
జార్ఖండ్ లో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని.. రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు. విక్రమార్కకు స్వాగతం పలికిన వారిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పోరేషన్ చెర్మన్ పోడెం వీరయ్య, కార్పొరేషన్ చెర్మన్లు నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వర రావు, పలువురు కార్పొరేటర్లు, వివిధ జిల్లాల, మండలాల ముఖ్య కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.