కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీకి స్థలం ఇవ్వని లగచర్ల గ్రామస్తులపై దాడి ఘటనను బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఫార్మా కంపెనీలపై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమని ప్రశ్నించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న 16 మంది లగచర్ల బాధితులతో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ ములాఖత్ అయ్యారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. ఓటేసి గెలిపించిన జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా అని నిలదీశారు.
లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని పేర్కొన్నారు. రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణకు రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యంతోనే లగచర్ల ఘటన జరిగిందని డీకే అరుణ అన్నారు. సీఎం రేవంత్ సోదరుడు రైతులను భయపెట్టారని ఆరోపించారు. ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని, గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లను వదిలేసి మిగతా వాళ్లను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్లను కలిసి మాట్లాడితే బాగుండేదన్నారు. భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదని స్పష్టం చేశారు.
రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని, సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకని నిలదీశారు. ఓటేసి గెలిపించిన జనాల కన్నా.. ఫార్మా కంపెనీ ముఖ్యమా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
సీఎం కొడంగల్ వాసి కాదని వలస వచ్చారని డీకే అరుణ విమర్శించారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారని మండిపడ్డారు. లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.